ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఎందుకు..? కేసీఆర్ ప్రభుత్వంపై జేజమ్మ గుస్సా
సీఎం కేసీఆర్పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడం సరికాదన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నరేందర్ సింగ్ తోమర్కు ఫిర్యాదు చేశారు. సమస్యపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు బీజేపీ నేత డీకే అరుణ. దీంతో సర్పంచ్లను సీఎం కేసీఆర్ అవమానిస్తోన్నారని మండిపడ్డారు. సర్పంచ్లు ఏమైనా పనులు చేయాలంటే ఉప సర్పంచ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గుర్తుచేశారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాకాకుండా గతంలో మాదిరిగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచ్లతో కలిసి తాము ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గత ఐదేళ్లుగా గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు డీకే అరుణ. దీంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిందని విమర్శించారు. తెలంగాణలో ఉన్న పరిస్థితి గురించి కేంద్ర మంత్రి సావధానంగా విన్నారని పేర్కొన్నారు. తాము వివరించిన అంశాలపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. డీకే అరుణతో కేంద్రమంత్రి తోమర్ను కలిసినవారిలో తెలంగాణ సర్పంచ్ల సంఘం వ్యవస్థాప అధ్యక్షుడు భూమన్న యాదవ్ తదితరులు ఉన్నారు.