భయపడను, లావుగా ఉంటే బలమైన నేత కాదు: నాగంపై డీకే అరుణ, దామోదర్కు బుజ్జగింపు
మహబూబ్నగర్: కాంగ్రెస్ పార్టీ గెలుపే తమ లక్ష్యమని, ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో డీకే అరుణ భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. దామోదర్ రెడ్డిని పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరినట్లు తెలిపారు. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి అని చెప్పారు.
తొందరపడొద్దని చెప్పా..
‘2004లో కేవలం 1400ఓట్లతోనే దామోదర్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా టీఆర్ఎస్లోకి వెళ్లినా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు. క్యాడర్ ఆయన వెంటే ఉంది' అని డీకే అరుణ చెప్పారు. ‘నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ్యక్తిగత నష్టం అని చెప్పాను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరాను' అని డీకే అరుణ చెప్పారు.
రాజకీయ కుట్ర.. నన్ను డీమోరల్ చేస్తే పార్టీకే నష్టం
డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చును. కాంగ్రెస్ గెలుపే లక్ష్యం' డీకే అరుణ తేల్చి చెప్పారు. ‘నా వ్యక్తిగతం కోసం పనిచేయడం లేదు. మహబూబ్నగర్లో ఎప్పుడూ వర్గం లేదు. ఇప్పుడే వినిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే పనిచేస్తున్నా. నన్ను డీ మోరల్ చేస్తే పార్టీకే నష్టం' అని డీకే అరుణ స్పష్టం చేశారు.
బలమైన నాయకుడంటే లావుగా ఉండటం కాదు..
నాగం జనార్దన్రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ, కాంగ్రెస్లో మాత్రం కాదని డీకే అరుణ విమర్శించారు. 'గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు?.. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు. ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు కాదు' అని అన్నారు.
నాగంను ఎలా చేర్చుకుంటారు?
‘నాగర్కర్నూల్లో మొదటినుంచి కాంగ్రెస్కి అండగా ఉన్నది దామోదర్రెడ్డే. అలాంటి నాయకుడితో అధిష్ఠానం సంప్రదింపులు జరపకుండా నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు' అని డీకే అరుణ అన్నారు. తాను సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్ధన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తూ దామోదర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.