జూపల్లి.. జూలో పిల్లి, మేం కాపలా కుక్కలం: డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూపల్లి జూలో పిల్లి అని, ఆయన వ్యాఖ్యలకు తాను స్పందించనని చెప్పారు. ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే జూపల్లికి తనను విమర్శించే స్థాయి లేదన్నారు. స్థాయి, వ్యక్తిత్వం లేని ఆయన మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడితే స్పందిస్తానని చెప్పారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, అంచనాలు వంటి వాటిలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అవినీతిలో ఉన్న వారంతా కెసిఆర్ బినామీలే అన్నారు. అక్రమాలు అడ్డుకోవడానికే కాపలు కుక్కల్లా తాము పని చేస్తామని డీకే అరుణ చెప్పారు.
ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకొని, ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడిచే నైపుణ్యం లేని వారికి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అవినీతిని సహించబోమని, కెసిఆర్ దోపిడీని అడ్డుకునేందుకు కాపలా కుక్కలా ఉంటామన్నారు.