టీఆర్ఎస్కు అదే భయం, రాహుల్ అంటే వణుకు: డీకే, పీసీసీపై కోమటిరెడ్డి
హైదరాబాద్/జగిత్యాల: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే టీఆర్ఎస్ పార్టీకి వణకు పుడుతోందని అన్నారు.
పీసీసీల కొనసాగింపు: ఆశావాహులపై రాహుల్ నీళ్లు, డీకే, రేవంత్కూ నిరాశే!
మహబూబ్నగర్ జిల్లా మరికల్, ధన్వాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు, నారాయణపేటలో సావిత్రబాయి పూలే జాతీయ అవార్డు గ్రహీత ఈశ్వరమ్మ అభినందనల సభలో పాల్గొని ప్రసంగించారు.
టీఆర్ఎస్కు అదే భయం
రాష్ట్ర కేబినెట్లో ఒక్క మహిళకు కూడా స్థానం లేకపోవడం మహిళలకే అవమానకరమని డీకే అరుణ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం టీఆర్ఎస్ పార్టీలో మొదలైందని అన్నారు.
చర్చ ఎందుకు?
హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడానికే ట్రిపుల్ తలాక్పై రాద్ధాంతం చేస్తోందని జగిత్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మళ్లీ చర్చ ఎందుకని ప్రశ్నించారు.
ఆశించిన మాట నిజమే
తాను పీసీసీ చీఫ్ ఆశించింది వాస్తవమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నా...ఎవరున్నా అందరం కలిసి పని చేస్తామని చెప్పారు.
అధిష్టాన నిర్ణయమే..
తలాకొన్ని నియోజకవర్గాలు పంచుకుని కాంగ్రెస్ను గెలిపిస్తామని, పాదయాత్ర, బస్సుయాత్ర ఏదైనా.. అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. రైతులు 12 గంటల విద్యుత్ చాలంటున్నారని, 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయని కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.