మామా అల్లుళ్లు మానుకోండి: హరీష్ - కెసిఆర్లపై డికె అరుణ
మహబూబ్ నగర్: మామ (ముఖ్యమంత్రి కెసిఆర్), అల్లుడు (మంత్రి హరీష్ రావు)లు తనను విమర్శించడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ శుక్రవారం నాడు మండిపడ్డారు. ఆమె పాలమూరు ప్రాజెక్టుల విషయమై విలేకరులతో మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్టుల పైన తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రూ.7వేల కోట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులకు ఖర్చు చేశామని చెప్పారు. మరో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నెల రోజులు కావొస్తుందన్నారు. కానీ, ఇప్పటి వరకు పనులు ఏమాత్రం ప్రారంభం కాలేదన్నారు.
కాగా, పాలమూరు ప్రాజెక్టు పైన కొద్ది రోజులుగా అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాయల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. తన పైన కెసిఆర్, హరీష్ రావులు విమర్శలు చేయడంపై డికె అరుణ పైవిధంగా స్పందించారు.