మా కుటుంబంలో చిచ్చుపెట్టావ్, బిచ్చమెత్తుకుంటా: కెసిఆర్పై అరుణ
మహబూబ్ నగర్: తమ కుటుంబంలో చిచ్చుపెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ గురువారం నాడు ధ్వజమెత్తారు. తన సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యానికి కెసిఆర్, టిఆర్ఎస్ తిలోదకాలు ఇస్తోందని ధ్వజమెత్తారు. కెసిఆర్ తమ కుటుంబంలో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తున్నారన్నారు. పార్టీ మారిన వాడు తన సోదరుడు అయినా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందన్నారు.
అవసరం అయితే బిచ్చం ఎత్తుకుంటా కానీ తాను తెరాసలోకి మాత్రం వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. రాజకీయాల్లో విలువలు ఉన్న నేత తన తండ్రి నర్సిరెడ్డి అని, తన సోదరుడు రామ్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరూ తన సోదరుడి వెంట వెళ్లలేదన్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కలిశారు.
అనంతరం ఆయన కారు ఎక్కారు. కారు ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే డీకే అరుణ సోదరుడు కావడం గమనార్హం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రామ్మోహన్రెడ్డితో మంత్రి లక్ష్మారెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. తాను టిఆర్ఎస్లోకి వచ్చినా తన సోదరి మాత్రం రారని చెప్పారు.