పట్టుబట్టిన డికె అరుణ: ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
హైదరాబాద్: గద్వాలను జిల్లాగా చేయాలనే డిమాండ్ను వదులుకోవడానికి కాంగ్రెసు శాసనసభ్యురాలు డికె అరుణ సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా గద్వాలను జిల్లాగా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు మరింత ఊపు చర్యకు దిగాలని డికె అరుణ భావిస్తున్నారు.
అందులో భాగంగానే గద్వాల జిల్లా కోసం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని అరుణ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి అనుచరులతో సమావేశమైన ఆమె ఈ అభిప్రాయానికి వచ్చారు. శనివారం రాజీనామా పత్రం సమర్పించాలని భావిస్తున్నారు.
జిల్లా ఏర్పాటుకోసం మొదటి నుంచి పోరాడుతున్న ఆమె అందుకు తానే అడ్డుగా ప్రభుత్వం భావిస్తుంటే రాజీనామాకు సిద్ధమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. దాంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు లేఖ రాసి రాజీనామా పత్రాన్ని స్పీకర్ మధుసూదనాచారికి అందజేస్తారని సమాచారం.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో పలు చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. గద్వాల, జనగామ, సిరిసిల్లలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. ఆందోళనలు కూడా సాగుతున్నాయి.