ఇవాంక పక్కన కెటిఆర్: డికె అరుణ సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో వేదికపై ఇవాంకా ట్రంప్ పక్కన కూర్చున్న మంత్రి కెటి రామారావును మహిళా మంత్రిగా భావించాలా అని కాంగ్రెసు శాసనసభ్యురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
మహిళే ప్రథమమనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సులో 52 శాతం మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కేబినెట్లో మహిళా మంత్రులు లేకపోవడం వల్లే కేటీఆర్ వేదికపై కూర్చుంటున్నారని విమర్శించారు.
మేయర్ ఎందుకు స్థానం ఇవ్వలేదు...
ప్రొటోకాల్ ప్రకారం అయితే హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్కు వేదికపై స్థానం ఎందుకు కల్పించలేదని డికెె అరుణ ప్రశ్నించారు. మెట్రో రైలు ఘనత కాంగ్రెస్దేనని, ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్డుకోవడం వల్లే ఆలస్యమైందని అన్నారు.
కెసిఆర్ పాత్ర ఏమీ లేదు..
మెట్రోను అడ్డుకోవడంలో తప్ప అది పూర్తికావడంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని డికె అరుణ అన్నారు. మెట్రో ద్వారా ప్రజలపై 3,500 కోట్ల అదనపు భారాన్ని మోపిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్కు రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోడం కెసిర్ కుత్సిత యోచనలకు నిదర్శనమని విమర్శించారు.
మా ప్రభుత్వం ఇలా...
తమ కాంగ్రెసు ప్రభుత్వంలో మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాకుండా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించామని డికె అరుణ అన్నారు. మహిళలకు మంత్రి వర్గంలో కెసిఆర్ స్థానం కల్పించకపోవడమే కాకుండా డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారని అన్నారు.
మహిళలకు అవమానం...
ఇవాంక ముందు కెటిఆర్ను ప్రముఖంగా చూపించడం ద్వారా కెసిఆర్ ప్రభుత్వం మహిళలను అవమానించిందని డికె అరుణ విమర్శించారు. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యానికి కెసిఆర్ కారణమని ఆమె విమర్శించారు.
ఇవాంకతో పాటు కెటిఆర్
బుధవారం మొదటి సెషన్లో ప్యానెల్ డిబేట్లో ఇవాంక ట్రంప్, కేటీఆర్ పాల్గొన్నారు. శిక్షణా నైపుణ్యాలలో కొత్త అంశాలపై ప్యానెల్లో చర్చ జరుగుతోంద. స్కిల్ ట్రైనింగ్, మెంటార్షిప్లో మహిళల ప్రాతినిధ్యంపై చర్చిస్తున్నారు.
కెసిఆర్ మూర్ఖం ముఖ్యమంత్రి
నాడు మెట్రో రైలు ప్రాజెక్టును వ్యతిరేకించి నేడు తన ఘనతగా చెప్పుకుంటున్న కెసిఆర్ ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి అని తెలంగాణ కాంగ్రెసు నాయకుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మెట్రో ప్రాజెక్టును మూడేళ్లు ఆలస్యం చేసి రూ.4 వేల కోట్ల భారానికి కారకుడయ్యాడన్నారు. మంగళవారం హన్మకొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్కు విశ్వ నగర కీర్తి కాంగ్రెస్ ఘనతేనని పొన్నాల అన్నారు.