కెసిఆర్కి వరుస్ షాక్లు: కవిత అసహనంకు తోడు కోర్టుకు డికె అరుణ
హైదరాబాద్: మహిళలకు పాలనలో వాటా దక్కడం లేదని గద్వార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా మొత్తం ఏడు రాష్ట్రాల మంత్రి మండళ్లలో మహిళలకు స్థానం లేదని ఆమె వ్యాజ్యంలో పేర్కొన్నారు.
తెలంగాణ కేబినెట్లో మహిళలకు చోటు దక్కకపోవడంపై కెసిఆర్ పైన తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కెసిఆర్ తనయ, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కూడా శనివారం శోచనీయమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో డికె అరుణ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి హోదాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని, అన్నింటిలోను సమాన హోదా అంటూ మంత్రివర్గంలో మాత్రం స్థానం కల్పించకపోవడం అన్యాయమని డికె అరుణ పిటిషన్లో పేర్కొన్నారు.
ఉమ్మడి ఏపీలో ఆరుగురం మహిళా మంత్రులం ఉన్నామని, తనతో పాటు మరో ఐదుగురు మహిళలు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవారమేనని అరుణ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతో పాటు గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, కొండా సురేఖలు మంత్రులుగా విధులు నిర్వర్తించాలన్నారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ నుండి గెలుపొందిన వారికి మంత్రిగా సామర్థ్యం లేదని భావిస్తే తెలంగాణ సమాజంలోని సమర్థులైన మహిళలకు మంత్రులుగా బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇతర పార్టీల వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లే, మహిళలను కూడా తీసుకోవాలన్నారు.
కెకె, డిఎస్ పైన అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం
కొంతమంది పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మారుతున్నారని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కెకెకు పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్లో ఉన్న వారికి చాలా అన్యాయం జరిగిందన్నారు.