కోదండరామ్ కెసిఆర్ పెరట్లో మొక్కే, జూన్ 8 నుండి పాదయాత్ర: డికె అరుణ
హైదరాబాద్: జూన్ 8వ తేది తర్వాత పాదయాత్రను నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ ప్రకటించారు. గద్వాల నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నట్టు ఆమె ప్రకటించారు.
సోమవారం నాడు ఆమె హైద్రాబాద్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆమె స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామాలతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆమె స్పందించారు.
కోదండరామ్ కెసిఆర్ పెరట్లో మొక్క
తెలంగాణ జనసమితి పేరుతో కొత్త పార్టీ పెట్టిన కోదండరామ్ కెసిఆర్ పెరట్లో మొక్కగా అభివర్ణించారని మాజీ మంత్రి డికె అరుణ. టిఆర్ఎస్ను ఓడించడమే కోదండరామ్ లక్ష్యమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఆమె కోదండరామ్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడే కోదండరామ్ లక్ష్యం నెరవేరుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
పాదయాత్ర చేయనున్న డికె అరుణ
గద్వాల నుండి ఆదిలాబాద్ వరకు జూన్ 8వ తేది తర్వాత పాదయాత్ర చేయనున్నట్టు మాజీ మంత్రి డికె అరుణ చెప్పారు. తెలంగాణ జిల్లాల్లోని అన్ని జిల్లాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో వాస్తు మారిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆ విషయం రాహుల్కే తెలుసు
సీనియర్లకు టిక్కెట్ల కేటాయింపు విషయం రాహుల్ గాంధీకే తెలుసునని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డికె అరుణ అభిప్రాయపడ్డారు. సీనియర్లకు టిక్కెట్లు ఇవ్వకుండా వారి స్థానంలో యువకులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడ లేకపోలేదు.ఈ తరుణంలో సీనియర్లకు టిక్కెట్ల కేటాయిస్తారో లేదా తనకు తెలియదని డికె అరుణ చెప్పారు.
నాగం చేరిక విషయం తెలియదు
మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం తనకు తెలియదని మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ అభిప్రాయపడ్డారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే నాగం జనార్ధన్ రెడ్డి చేరికను దామోదర్ రెడ్డి వ్యతిరేకించారు. దామోదర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్ళి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించినట్టు ప్రచారం కూడ లేకపోలేదు.