నా కూతురుకోసం టిక్కెట్ అడుగుతా, జైపాల్ రెడ్డితో ఏజ్ గ్యాప్వల్లే: డీకే అరుణ, రేవంత్పైనా
హైదరాబాద్: కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఇవ్వవద్దని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ గురువారం అన్నారు. ఆయనకు బదులు బీసీలకు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. తన కూతురుకు మహబూబ్ నగర్ సీటును అడుగుతామని ఆమె అన్నారు.
అధికార టీఆర్ఎస్ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మరింత వేగం పెంచాలని ఆమె అభిప్రాయపడ్డారు. తాను పీసీసీ రేసులో ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. తద్వారా తాను కూడా పీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నానని స్పష్టం చేశారు.
మహిళల సమావేశంలో తనకు అవకాశం ఇవ్వలేదని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు అనేది తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. జైపాల్ రెడ్డికి తనకు ఏజ్ గ్యాప్ వల్లే విభేదాలు అన్నారు.