పార్టీ మారను: కేసీఆర్కు డీకే అరుణ ధన్యవాదాలు, కొత్త రెవెన్యూ డివిజన్లివే
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు మాజీ మంత్రి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. గద్వాలను జిల్లాగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైవపర్ కమిటీ మంగళవారం రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు నివాసంలో సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కేశవరావుతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గద్వాల జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
గద్వాల జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యత గురించి హైపర్ కమిటీకి వివరించానని తెలిపారు. పార్టీ మారేదానినైతే ఎప్పుడో మారేదానినని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, రాదు కూడా అని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
గద్వాల జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించేందుకే తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపించానని వెల్లడించారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా గద్వాల జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. గద్వాలను జిల్లాగా చేయాలంటూ డీకే అరుణ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్ష
జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త జిల్లాలపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్ ఒక్కో జిల్లాను, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని ఆయన సూచించారు.
సిద్ధిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని చెప్పారు. దసరా రోజు నుంచే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో పని ప్రారంభించాలని, ఎవరు ఏ కార్యాలయం ప్రారంభించాలో జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిద్ధిపేటలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్తో పాటు సిద్ధిపేట కమిషనరేట్ ప్రతిపాదనను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీసు కమిషనరేట్లోకి, జనగామ జిల్లాను వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి తీసుకువారాలని సలహాయిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని సూచించారు. మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్తో పాటు చేవెళ్ల మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేరుస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోనే నాగిరెడ్డిపేట మండలాన్ని ఉంచాలని అధికారులకు సూచించారు.
ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్, మనోహరాబాద్.. నిజామాబాద్ జిల్లాలోని చందూరు, ములుగు నియోజకవర్గంలోని కన్నాయిగూడెం, నిర్మల్ అర్బన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని సూచించారు.