నాతో చెప్పలేదేం: తెరాసలో చేరిన సోదరుడి 'వ్యాఖ్య'పై డీకే అరుణ అసహనం
హైదరాబాద్: తన సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలను కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ గురువారం నాడు అసహనం వ్యక్తం చేశారు.
డీకే అరుణ సోదరుడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దాదాపు పదిహేను రోజుల క్రితం తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఆయన డీకే అరుణ సోదరుడు కావడం గమనార్హం. ఆయన చేరికతో తనకు సంబంధం లేదని డీకే అరుణ చెప్పింది. ఆనాడు సోదరుడి పైన మండిపడింది.
కాగా, గురువారం సిఎల్పీ భేటీ అయింది. వారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని పరిగి ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థి ఖర్చుకు.. ఎమ్మెల్యేలు తమ నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్లు మాట్లాడుతూ.. తమను కూడా చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెరాసలోకి రమ్మని చెప్పారని వ్యాఖ్యానించారు. దానిపై డీకే అరుణ అసహనం వ్యక్తం చేసింది. ఆ విషయం నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదని అడిగారు.