గద్వాల నుంచే పతనం: కేసీఆర్కు అరుణ వార్నింగ్, ‘హరీశ్ జాగ్రత్త! కేటీఆర్ నీ సంగతి చూస్తాం’
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గద్వాల నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నారు. ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడే ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు.
గద్వాల సభలో కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, మామా అల్లుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ అని డీకే అరుణ గుర్తుచేశారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ శుక్రవారం గద్వాలలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఆ దుర్గమ్మకు తెలుసు
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించకపోవడంపై డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాలను మోసం చేసే వాళ్లు ఎవరో విజయవాడ కనకదుర్గమ్మకు బాగా తెలుసని అన్నారు.
హరీశ్ ఎప్పుడో కాంగ్రెస్లోకి
పరిస్థితులు అనుకూలించి ఉంటే మంత్రి హరీష్రావు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకునేవారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.
హరీశ్ జాగ్రత్త..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ‘జై తెలంగాణ అన్న వారిపై దాడి చేసిన వారికి మంత్రి పదవులిచ్చి తనకు రెండు వైపులా కూర్చోబెట్టుకుంది నీవు కాదా కేసీఆర్' అని డీకే అరుణ నిలదీశారు. ‘మంత్రి హరీష్ రావు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకో' అని డీకే అరుణ హెచ్చరించారు.
సంగతి చూస్తామంటూ కేటీఆర్కు హెచ్చరిక
ఇది ఇలా ఉంటే, మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు.. బొమ్మా కాదు.. ' అని కేటీఆర్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీపై మరోసారి నోరు జారితే కేటీఆర్ సంగతి చూస్తామంటూ వీహెచ్ హెచ్చరించారు.
నీ ఇంటికే వస్తా.. కేసీఆర్.. జాగ్రత్త
‘నీ ఇంటికే వస్తా.. తాడోపేడో తేల్చుకుంటా. ఖబడ్ధార్.. కేటీఆర్.. నీవెంత.. నీ స్థాయి ఎంత?' అని వీహెచ్ విరుచుకుపడ్డారు. అంతేగాక, ‘కేసీఆర్.. నీ కుమారుడిని అదుపులో పెట్టుకో' అంటూ వీహెచ్ హెచ్చరించారు.