జూపల్లికి మెదడులో పెండ ఉంది.. అడ్డంగా వాగితే ఊరుకునేది లేదు.. : డీకే అరుణ ఫైర్
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో డీకే అరుణ జూపల్లి కృష్ణరావుల మధ్య వైరం ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోను ఇరు నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. విమర్శలు-ప్రతి విమర్శలతో ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ పోతున్న క్రమంలో.. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ, జూపల్లిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం చర్చనీయాంశంగా మారింది.
అధికార టీఆర్ఎస్ పార్టీని, మంత్రి జూపల్లికృష్ణారావుని టార్గెట్ చేస్తూ పదునైన వ్యాఖ్యలతో విమర్శల వర్షం గుప్పించారు డీకే అరుణ. జిల్లాలో ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించిన డీకే అరుణ.. 'తనకు మెదడు ఉంది కాబట్టి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే దశకు తీసుకొచ్చానని, జూపల్లికి మెదడులో పెండ ఉండబట్టే ప్రాజెక్టులను గాలికి వదిలేశారని' ఎద్దేవా చేశారు.
తనతో మంచిగా మాట్లాడితే మంచిగానే సమాధానం చెబుతానన్న డీకే అరుణ, ప్రాజెక్టుల పేరు చెప్పి అడ్డమైన గడ్డి తినేవాళ్లు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఇక ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వమంతా అవినీతిమయం అయిపోయిందని ఆరోపించిన అరుణ, అమరవీరుల స్థూపం విరిగిపోయేలా నిర్మించారంటేనే ప్రభుత్వం ఏ మేరకు నాణ్యమైన చర్యలు చేపట్టిందో అర్థమవుతోందని.. దీని ద్వారా ప్రభుత్వ అవినీతి తేట తెల్లమైందని విమర్శించారు.