తెలంగాణ బీజేపీ చీఫ్గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..
తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీకే అరుణ అయితే బాగుంటుందని బీజేపీ హై కమాండ్ యోచిస్తోంది. అధ్యక్ష పదవీ కట్టబెట్టి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ సమాచారం అందజేసింది. దీంతో ఆమె హుటహుటిన ఢిల్లీకి పయనమయ్యారు.
జేజమ్మకు ఎందుకంటే..
అక్కడ బీజేపీ చీఫ్ అమిత్ షా, కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా అరుణకు అధ్యక్ష బాధ్యతకు సంబంధించి సమాచారం అందజేసే అవకాశాలు ఉన్నాయి. డీకే అరుణ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్తుందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే అధ్యక్ష పదవీకి డైనమిక్ లీడర్కి అప్పగిస్తోంది.
రాజాసింగ్ అసంతృప్తి..
మరోవైపు అధ్యక్షుడు లక్ష్మణ్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వెల్లగక్కిన మరునాడే డీకే అరుణ పేరు తెరపైకి రావడం విశేషం. మంగళవారం ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ లేదంటే డీకే అరుణను నియమించాలని కోరారు. ఆ మరునాడే అరుణకు హైకమాండ్ నుంచి పిలుపురావడం విశేషం.
క్యాడర్ లోపం..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్య నేతలు ఉన్నారు కానీ.. క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. దీంతో ఆయా ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపలేకపోతుంది. ఈ అంశాన్ని బీజేపీ హైకమాండ్ కూడా పరిశీలించింది. డీకే అరుణ అయతే బాగుంటుందని.. అందరినీ కలుపుకొనిపోయి... పార్టీని మంచి స్థానానికి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఆమె హయాంలో బీజేపీ బలోపేతమై.. వచ్చే ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా అవతరించాలని కమలనాథుల వ్యుహం.
వర్గపోరు..
రాష్ట్ర బీజేపీలో కూడా వర్గాలు ఉన్నాయి. ఎవరికీ వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో డీకే అరుణ అభ్యర్థిత్వాన్ని అంగీకరించే వారేవరు అన్నదే ప్రశ్నగా మారింది. వ్యతిరేకులు గ్రూపు రాజకీయాలు చేస్తే.. పరిస్థితి ఏంటీ అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ పార్టీ నేతలంతా కలుపుకొని పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. హై కమాండ్ ఆదేశాలతో నేతలు కలిసి పనిచేస్తారో లేదా ఎడమొహం పెడమొహం పెడతారో చూడాలి మరీ.