రేవంత్ మంచి మిత్రుడు: 6గం.ల పాటు శ్రీనివాస్ నాయుడి విచారణ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని మాజీ పార్లమెంటు సభ్యుడు డికె ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్ నాయుడు మంగళవారం చెప్పారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి తనకు నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు అతనిని ఎసిబి విచారించింది. రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి, స్టీఫెన్ సన్కు ఇచ్చిన రూ.50 లక్షల గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
విచారణ ముగిసిన అనంతరం డికె శ్రీనివాస్ నాయుడు విలేకరులతో మాట్లాడారు. తన కార్యాలయం నుంచి నగదు వెళ్లిందని చెప్పడం అవాస్తవమని చెప్పారు. రేవంత్ రెడ్డితో తనకు ఉన్న సంబంధాల పైన ప్రశ్నించారని చెప్పారు. ఏసిబి అధికారులు మళ్లీ పిలిస్తే తాను విచారణకు హాజరవుతానని చెప్పారు.
తాను ఎసిబి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని చెప్పారు. అయితే, ఈ కేసుతో మాత్రం సంబంధం లేదని చెప్పారు. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి విష్ణు చైతన్య కూడా విచారణకు హాజరవుతారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆయన వస్తారన్నారు.
శ్రీనివాస్ నాయుడుకు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి 160 సిఆర్సీ కింద సోమవారం నోటీసులు అందజేసింది. దీంతో ఆయన బంజారాహిల్స్లోని ఎసిబి కార్యాలయానికి విచారణ కోసం హాజరయ్యారు. ఇటీవల ఎసిబి ఓటుకు నోటు కేసును వేగవంతం చేసింది.