పరిహారం పట్ల రాజీపడొద్దు..! భూసేకరణ లో వేగం పెంచాలి..! మల్లన్న సాగర్ పై కేసీఆర్ సమీక్ష..!!
హైదరాబాద్: మల్లన్న సాగర్ జలాశయం పనుల పురోగతిపై సీఎం చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
నిర్వాసితులకు పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఈ నెల 11 లోపు హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పర్యవేక్షించాలని చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
పరిహారం పంపిణీ కోసం గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ గుండెకాయ వంటిదని ముఖ్యమంత్రి అభివర్ణించారు. భూనిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, పునరావాసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా ప్యాకేజీ ఇస్తున్నామని చంద్రశేఖర్ రావు తెలియజేసారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలతో పరిహారం, పునరావాసం అందిస్తున్నామని తెలిపారు.
ఆరు ఏడు నెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేయాలని, వచ్చే ఏడాది జూన్లో రిజర్వాయర్లో నీళ్లు నింపాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారు. మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలిందని, దాన్ని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అదికారులకు చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేసారు.