పార్టీ మారే ఉద్దేశం లేదు..! అన్నీ తప్పుడు వార్తలే అంటున్న టీడిపి ఎమ్మెల్యే..!!
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుపై అశ్వారావుపేట టీడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏదీ లేదని స్పష్టంచేశారు. తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్కు చెందిన నలుగురు శాసనమండలి సభ్యులు అదికార గులాబీ పార్టీలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తమ మండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ప్రతిపాదించడం, ఛైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో టీడిపి కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడతారన్న ప్రచారం ఊపందుకుంది.సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర వెంకట వీరయ్య అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో సమావేశమై మంతనాలు సాగించారు. తనకు టీఆర్ఎస్ అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని సండ్ర స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ మారే అంశం మాత్రం ప్రస్తావనకు రాలేదని మెచ్చా తెలిజేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ మారతారన్న ఊహాగానాలను మెచ్చా నాగేశ్వరరావు కొట్టిపారేశారు.