అక్రమ గని దేవికారాణి : రూ.200 కోట్ల ఆస్తులు, ఇల్లు, విల్లా, ప్లాట్లు.. వ్యవసాయ భూమి కూడా..
ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో మాజీ డైరెక్టర్ దేవికారాణి అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ బిల్లులతో రూ.కోట్ల కొట్టేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట్ల భూములు, ప్లాట్లు, భవనాలు, బాండ్లు, నగదు కలిపి మొత్తం రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయనే కళ్లు బైర్లు కమ్మె నిజాలను అధికారులు వెల్లడించారు. తన ఆస్తులను దేవికారాణి ఒక్క హైదరాబాద్కే పరిమితం చేయలేదు. ఏపీలో కూడా భవనాలు, ప్లాట్లు కొనుగోలు చేసింది.
విస్తుబోయిన అధికారులు
దేవికారాణి ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. ఇప్పటివరకు రూ.200 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో 50 చోట్ల అధికారులు దేవికారాణి ఆస్తులను గుర్తించారు. తెలుగురాష్ట్రాల్లో 11 చోట్ల దేవికారాణికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని.. వాటి ధర కోట్లలో ఉంటుందని ఏసీబీ అధికారులు వివరించారు.
ఇల్లు, విల్లా, భూములు
భాగ్యనగర సిగలో దేవికారాణి అక్రమ ఆస్తులను భారీగానే కూడబెట్టారు. షేక్పేట్లో రూ.4 కోట్ల విలువైన విల్లాను గుర్తించారు. షేక్ పేట్ ఆదిత్య టవర్స్లో మూడు ప్లాట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. సోమాజిగూడలో 3 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. నానక్ రామ్గూడలో ఇండిపెండెంట్ ఇల్లు కూడా ఉందని వివరించారు. హైదరాబాద్లో 18 చోట్ల దేవికారాణికి కమర్షియల్ షాపులు ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో 32 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని పేర్కొన్నారు.
ఏపీలో కూడా
ఇటు ఏపీలో కూడా దేవికారాణి ఆస్తులను కూడబెట్టారు. చిత్తూరులో రూ.కోటి విలువగల భవనం ఉందని వివరించారు. విశాఖపట్టణం, మధురవాడలో కూడా దేవికారాణికి ఇండిపెండెంట్ ఇల్లును ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.6.5 కోట్ల విలువైన డిపాజిట్లను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆమెకు దాదాపు 23 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని.. వాటిల్లో రూ.కోటిన్నర నగదు ఉందని వెల్లడించారు.
ఇలా వెలుగులోకి..
నకిలీ బిల్లులతో ఈఎస్ఐ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ దేవికారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మతో కలిసి సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. డైరెక్టర్ దేవికారాణి అండతో సూపరిండెంటెంట్ సురేంద్రనాథ్ రెచ్చిపోయాడు. రూ.10 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దేవికారాణి, పద్మ సహా 16 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత సురేంద్రనాథ్.. ఇటీవల ఐఎంఎస్ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ వీరన్నను కూడా అదుపులోకి తీసుకున్నారు.
నగదు బంగారంగా..
వీరన్న హెఫార్మా కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నగదును బంగారం రూపంలో మార్చారని అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దేవికారాణికి అప్పగించినట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ ఆరోపణలపైనే వీరన్నను అదుపులోకి తీసుకున్నారు.
స్కాం గుర్తించింది ఇలా..
మెడికల్ కిట్ల పేరుతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సిబ్బంది స్కాం చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. దేవికారాణి అండతోనే కుంభకోణం జరిగిందని వెల్లడించారు. 2017-18లో మెడికల్ కిట్ల కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఇందులో మొత్తం 22 ఇండెంట్లు ఉన్నాయి. అయితే 2 ఇండెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇందులో స్కాం జరిగినట్టు గుర్తించారు.