డెలివరీ చేస్తూ శిశువు తల కోసేసిన డాక్టర్.. గంటలపాటు తల్లికి నరకం చూపించారు..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేటలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉండి సోయి తప్పిన ఓ డాక్టర్.. గర్భిణికి డెలివరి చేస్తూ ఏకంగా శిశువు తలను కోసేశాడు. తల తెగడంతో ప్రాణాలు కోల్పోయిన శిశువు.. గంటల పాటు కడుపులోనే ఉండిపోవడంతో తల్లి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని దాచి పెట్టి గర్భిణిని హైదరాబాద్ తీసుకెళ్లండంటూ బంధువులకు సలహా ఇచ్చాడు. విషయం తెల్సుకున్నబాధితురాలి బంధువులు ఆస్పత్రిముందు ధర్నాకు దిగారు.
తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం..
అచ్చంపేట మండలానికి చెందిన గర్భిణి నెలలు నిండటంతో ప్రభుత్వాసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరి కోసం ఎదురుచూడాల్సి ఉన్నా.. శుక్రవారం హడావుడిగా ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. డెలివరీ టైమ్ లో శిశివు తల కోసేసిన డాక్టర్.. చేసిన తప్పును కప్పి పుచ్చుకోడానికి మిగతా డాక్టర్ల సాయం తీసుకున్నాడు. పెద్ద డాక్టర్లుగా ఎంట్రీ ఇచ్చిన మిగతా డాక్టర్లు.. మహిళ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లమని ఆమె బంధువులకు చెప్పారు.
ఆస్పత్రి ముందు ధర్నా.. ఫర్నీచర్ ధ్వంసం
గర్భిణిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే శిశువు చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. శిశువు తల కోసేసి ఉందని, దానికారణంగా తల్లి పరిస్థితి విషమంగా మారిందని వివరించారు. దీంతో బాధితురాలి బంధువులు మళ్లీ గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ ను నిలదీశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఫర్నీచర్ ధ్వంసమైంది. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రి ముందు ధర్నాకు దిగిన బంధువులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
కేసీఆర్ కిట్ తో గవర్నమెంట్ ఆస్పత్రులకు పెరిగిన డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కేసీఆర్ కిట్ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వైద్య సౌకర్యాల పెంపు కోసం కూడా నిధులు కేటాయించనున్నట్లు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించారు. అంతలోనే అచ్చంపేటలో ఇలాంటి దారుణ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు ఇంకా స్పందించాల్సిఉంది.