చిటికెన వేలుకి ఆపరేషన్ చేస్తే మరణించిన రోగి.. ఓ కార్పోరేట్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చిటికెన వేలుకు ఆపరేషన్ చేస్తే వ్యక్తి మరణించిన ఘటన స్థానికంగా షాక్ కు గురి చేసింది. ఇక ఈ ఘటన బయటకు పొక్కకుండా గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసిన ఆస్పత్రి వైద్యులు గుట్టుగా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు .
ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు.. కడుపులో దూది పెట్టి కుట్లేశారు
ఇక అసలు విషయానికొస్తే కాలి చిటికెన వేలుకు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసిన మరుసటి రోజే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న విరించి ఆసుపత్రిలో సింగరేణి ఉద్యోగి సంగీత్ రావు చేరారు. ఆయన కాలికి శనివారం వైద్యులు ఆరేషన్ చేశారు. ఆపరేషన్ తరువాత అనారోగ్యానికి గురైన ఆయన , ఆదివారం రోజు తీవ్ర అస్వస్థత బారిన పడ్డారు. అయితే ఆరోగ్యం విషమించడంతో సంగీత్ రావు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో విరించి ఆసుపత్రి డాక్టర్లు మృతదేహాన్ని గుట్టుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద ఘర్షణ జరగకుండా మృత దేహాన్ని తరలించటం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆయన మృతి చెందారనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈరోజు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిపై దాడులు జరగకుండా దీంతో ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.