అచ్చం ఠాగూర్ సినిమా సీనే.. వైద్యం చేస్తున్నట్లు నటించి..
ఠాగూర్ సినిమా సీన్ హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో రిపీట్ అయింది. రోగి మరణించినా ఆ విషయం బంధువులకు చెప్పకుండా లక్షల్లో డబ్బు కట్టించుకున్నారు.
హైదరాబాద్: ఠాగూర్ సినిమాలోలా మరణించిన వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి బంధువుల నుంచి భారీగా డబ్బు కట్టించుకున్న వైనమిది. శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆసుపత్రి ఈ దారుణానికి వేదికైంది. నిజమాబాద్ కు చెందిన నాగభూషణరావు(60) అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం సిటిజన్ ఆసుప్రతిలో చేరారు.
అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణరావు మృతి చెందగా.. ఆ విషయాన్ని ఆసుపత్రిలోని వైద్యులు ఆయన బంధువులకు చెప్పలేదు. పైపెచ్చు ఆయన కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు, తాము ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సీన్ క్రియేట్ చేశారు.
మధ్య మధ్యలో దానికి, దీనికి అంటూ నాగభూషణరావు కుటుంబ సభ్యుల నుంచి రెండు విడతలుగా రూ.6.5 లక్షలు కట్టించుకున్నారు. అలా 27 గంటల పాటు ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేసి చివరికి తాము ఎంతగానో ప్రయత్నించామని, తమ ప్రయత్నాలన్నీ విఫలమై ఆయన మరణించారని విషణ్ణ వదనాలతో చెప్పారు.
దీంతో నాగభూషణరావు బంధువులు ఆసుపత్రికి ముందే ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం వల్లనే ఆయన ప్రాణాలు పోయాయని ఘొల్లుమన్నారు. ఆయన ప్రాణం పోయిన తరువాత కూడా చికిత్స చేస్తున్నట్లుగా వైద్యులు నటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.