గుండెపోటు కూడా: రోహిత్ ఆత్మహత్య తర్వాత తీవ్ర ఒత్తిడిలో తల్లి రాధిక
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోగ్య పరిస్థితి కూడా ఏమంత బాగోలేదని వైద్యులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఛాతిలో ఆమెకు నొప్పిరావడంతో ఆమెను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమె కుడి హృదయ ధమనిలో అడ్డంకి ఉన్నట్టుగా గుర్తించారు. ఈ అడ్డంకి వల్ల గుండెకు రక్తప్రసరణ సరిగా లేదని, ఒకానొక సందర్భంలో ఇది గుండె పోటుకు కూడా దారి తీయవచ్చని రిపోర్ట్స్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రోహిత్ తల్లి రాధిక వేముల యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్లోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు యూనివర్సిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఆమె కుడి హృదయ ధమనిలో 50 నుంచి 60 శాతం వరకు అడ్డంకి ఉన్న మాట వాస్తవమేనని, అయితే వెంటనే ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదన్నారు.
అన్నయ్య ఆత్మహత్యతో తన తల్లి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని రోహిత్ సోదరి నీలిమ వేముల తెలిపారు. ఆమెకు అధిక రక్తపోటు రావడం ఇదే మొదటిసారని నీలిమ పేర్కొన్నారు. దీని వల్ల ఆమె గత 4-5 రోజుల నుంచి తీవ్ర ఒత్తిడి గురై మరింత అలసటగా కనిపిస్తున్నారన్నారు.
రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాంటూ హెచ్సీయూలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో రోహిత్ తల్లి రాధిక దీక్ష చేస్తుండగా ఆమెకు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తీవ్ర ఒత్తిడే ఆమె అస్వస్థతకు కారణమని వైద్యులు తెలిపారు.
మరోవైపు 90 గంటల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన పీహెచ్డీ స్కాలర్స్ కే జయరావు, టి. రమేషలు శనివారం అవస్వస్థతకు గురికావడంతో వారిని కాంటినెంటెల్ ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం వీరిద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.