ఆపరేషన్ చేసి బ్లేడును మహిళ కడుపులోనే వదిలేశారు: మంత్రి ఇలాకాలోనే ఘటన
మహబూబ్నగర్: కుటుంబ నియంత్రణ(కు.ని) శస్త్రచికిత్స సమయంలో ఓ మహిళ కడుపులోనే బ్లేడును వదిలేశారు వైద్యులు. వారి నిర్లక్ష్యం ఆ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం లింబ్యాతండాకు చెందిన సరోజకు జడ్చర్ల మండలం లింగంపేట గ్రామపంచాయతీ పరిధిలోని నల్లకుంట తండాకు చెందిన రెడ్యానాయక్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా.. ఐదు నెలల కిందట కుమార్తె పుట్టింది.
సరోజకు ఆగస్టు 20న జడ్చర్ల కమ్యూనిటీ ఆస్పత్రిలో కు.ని శస్త్రచికిత్స చేయించారు. చికిత్స సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కడుపులోనే బ్లేడును వదిలేశారు. దీంతో సరోజ అస్వస్థతకు గురై నడవలేని స్థితికి చేరుకుంది.
పదిరోజుల తర్వాత కుట్లలోంచి బ్లేడు చిన్నదిగా కనిపించడంతో ఆదివారం స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సాయంతో బయటకు తీసినట్లు సరోజ భర్త రెడ్యానాయక్ తెలిపారు. పది రోజులుగా రక్తస్రావంతో పాటు పైకి లేవలేని స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తండావాసుల సాయంతో ఆదివారం సాయంత్రం జడ్చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి వైద్యులకు చూపించారు. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా అని వైద్యులను నిలదీశారు. కాగా, మెరుగైన వైద్యం అందిస్తామని జడ్చర్ల ఎస్పీహెచ్ఓ మల్లిఖార్జునప్ప తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు.