హిమయత్ నగర్లో కాల్పుల కలకలం: ఒక డాక్టర్పై మరో డాక్టర్ కాల్పులు
హైదరాబాద్: నగరంలోని హిమయత్ నగర్లో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు డాక్టర్ల మధ్య చెలరేగిన వివాదం చివరకు ఒక డాక్టర్పై మరో డాక్టర్ కాల్పులు జరిగే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే, నగరంలోని హిమాయత్ నగర్ 6వ నంబర్ వీధిలోని రాజా రెసిడెన్సీలో లారెల్ ఆస్పత్రి డాక్టర్ల సమావేశం జరిగింది.
మాదాపూర్కు చెందిన లారెల్ హాస్పిటల్ డాక్టర్లు హిమాయత్ నగర్లోని స్ట్రీట్ నెం 6లో ఉన్న రాజా రెసిడెన్సీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ శశికుమార్, డాక్టర్ ఉదయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో శశికుమార్ తన వద్ద ఉన్న గన్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.
కాల్పుల ఘటన జరిగిన సమయంలో ఒకే కారులో ముగ్గురు డాక్టర్లు ప్రయాణించారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో డాక్టర్ శశికుమార్ తన వద్ద ఉన్న తుపాకీతో డాక్టర్ ఉదయ్పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ శబ్దాలకు స్థానికులు అటు ఇటు పరుగులు తీశారు.
కాల్పుల్లో గాయపడ్డ డాక్టర్ ఉదయ్ పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. రాజా రెసిడెన్నీలో జరిగిన డైరెక్టర్ల సమావేశంలో తుపాకులను అనుతించించడంపై ఇది ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిందని అనుమానిస్తున్నారు.
దీంతో తమ వెంట తుపాకులను తీసుకెళ్లారంటే ఉద్దేశ పూర్వకంగా ఒకరిపై మరొకరు కాల్పులకు పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రి విషయంలో జరిగిన లావాదేవీల కారణంగానే ఇద్దరి డాక్టర్ల మధ్య కాల్పులకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.