ఎత్తు పెరగడానికి కాళ్లకు ఆపరేషన్: టెక్కీ నిఖిల్ రెడ్డికి చికిత్స నిలిపివేత, రక్తస్రావం?
హైదరాబాద్: ఎత్తు పెరిగేందుకు రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న టెక్కీ నిఖిల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర వేదనకు గురవుతున్నాడు. అతను నడవలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ను తెలంగాణ వైద్య మండలి సస్పెండే చేసింది. దీంతో గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం అతనికి చికిత్స నిలిపివేసినట్లు సమాచారం.
తమ డాక్టర్ను సస్పెండ్ చేయించారని, తాము వైద్యం చేయలేమని, మరో డాక్టర్ను చూసుకోవాలని గ్లోబల్ ఆస్పత్రి వర్గాలు అంటున్నాయని నిఖిల్ రెడ్డి తండ్రి చెబుతున్నారు. ప్రతి వారం మాదిరిగా గత శుక్రవారం ఇంటికి వచ్చి నిఖిల్కు డ్రెస్సింగ్ చేయాల్సిన డాక్టర్ ఈసారి రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే తనను సస్పెండ్ చేశారని, చికిత్స చేయడానికి వీలు లేదని డాక్టర్ చంద్రభూషణ్ అంటున్నారు.
ఆస్పత్రికి చెందిన ఇతర వైద్యులను అడిగితే కూడా తమకూ సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారని నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేరే ఆస్పత్రులను సంప్రదించినా ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో నిఖిల్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దిక్కు తోచని స్తితిలో పడ్డారు.
ఏప్రిల్లో నిఖిల్కు శస్త్రచికిత్స
ఈ ఏడాది ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్రెడ్డికి ఎత్తు పెరిగేందుకు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న నిఖిల్ తండ్రి గోవర్ధన్రెడ్డి ఈ ఆపరేషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం వైద్య మండలి దృష్టికి వెళ్లింది.
నిఖిల్ రెడ్డిని డిశ్చార్జీ చేసిన ఆస్పత్రి
సమస్య తీవ్రం కావడంతో, నిఖిల్రెడ్డిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడ్రోజులకు ఒకసారి డాక్టర్ చంద్రభూషణ్ వచ్చి వైద్య సహాయం అందిస్తారని, డ్రెస్సింగ్ కూడా చేస్తారని చెప్పారు. కొన్నాళ్లూ మాట నిలబెట్టుకున్నా, ఆ తర్వాత డాక్టర్ వారానికి ఓసారి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అదీ నిలిపివేశారు. గత శుక్రవారం (4వ తేదీ) నిఖిల్ ఇంటికి రావాల్సిన డాక్టర్ చంద్రభూషణ్ రాలేదు
చంద్రభూషణ్ ఎందుకు రాలేదు...
రాష్ట్రంలో వేర్వేరు కేసుల్లో అనైతిక చికిత్సలు చేసిన పలువురు వైద్యులపై గత శుక్రవారమే వైద్య మండలి చర్యలు తీసుకుంది. నిఖిల్కు సర్జరీ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. రెండేళ్లపాటు ఆయన లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చికిత్స నిలిపివేసిన ఆయన.. ఏదన్నా ఉంటే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుకోవాలని సూచించారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా ఇక తామేమీ చేయలేమని తేల్చేసింది.
అలా అన్నారని నిఖిల్
ప్రతి వారం రెండు కాళ్లకు డ్రెస్సింగ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ వస్తోందని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. రక్తస్రావంతో కాళ్లకు వేసిన బ్యాండేజీ తడిసిపోతుందని, చీము వస్తుందని చెప్పారు. విపరీతమైన నొప్పి వస్తోందని, రాడ్స్ దగ్గర పుండ్లు ఏర్పడుతున్నాయని బాధ వ్యక్తం చేశాడని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. గతంలో ఇలాంటి సమస్యే వస్తే శక్తివంతమైన యాంటీ బయాటిక్ ఔషధాలు ఇచ్చారని తెలిపారు.
డ్రెసింగ్ కూడా చేయకపోవడంతో..
ప్రస్తుతం డ్రెస్సింగ్ కూడా చేయకపోవడంతో బాధ మరీ ఎక్కువైందని నిఖిల్ కన్నీటి పర్యంతం అయ్యారని ఆ పత్రిక రాసింది. పరిస్థితి బాగా మెరుగుపడిందని, రెండు వారాల్లో నడిపిస్తాననీ మెట్లు కూడా ఎక్కిస్తానని అన్నారని, అయితే నెల రోజులు గడిచినా పరిస్థితి మెరుగు పడలేదని నిఖిల్ అన్నాడు.
ఆస్పత్రిలో చికిత్స చేస్తారని చెప్పాం
నిఖిల్రెడ్డి ఇంటికి వెళ్లి ప్రతి శుక్రవారం డ్రెసింగ్ చేస్తున్నానని, అతని పరిస్థితి మెరుగుపడడంతో ఆస్పత్రికి వచ్చి డ్రెసింగ్ చేయించుకోవాలని సూచించానని చంద్రభూషణ్ అ ప్రముఖ దినపత్రికతో చెప్పారు. 4వ తేదీన ఆస్పత్రికి వస్తామన్నారని, ఆరోజు ఫోన్ చేసి ఆస్పత్రికి రావాలని కోరినా వారు రాలేదని ఆయన చెప్పారు. ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందే స్థితిలో నిఖిల్ ఉన్నారని, ఆయన ఆస్పత్రికి వస్తే ప్రత్యేక వైద్యుడిని నియమిస్తారని, నిఖిల్కు చికిత్స కోసం ఆస్పత్రి వర్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయని డాక్టర్ చంద్రభూషణ్ చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.