ఎవరూ ఊహించని రీతిలో!: కుక్క గొలుసే అతనికి యమపాశమైంది..
అప్పటికే రేవంత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
హైదరాబాద్: రాత్రి డిన్నర్ తర్వాత పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని సరదాగా బయటకెళ్లిన యువకుడు ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. కుక్కు గొలుసే అతని పాలిట యమపాశంగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.హైదరాబాద్ లోని కబూతర్ ఖానాలో ఉన్న చిన్న బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిన్నబజార్కు చెందిన పి.రవీందర్ కుమారుడు రేవంత్ (19) స్థానికంగా ఇంటర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి 11గం. సమయంలో భోజనం ముగించిన తర్వాత.. పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్ కోసమని బయటకొచ్చాడు. అప్పటికే వర్షం పడి ఉండటంతో.. రోడ్డు పక్కన ఓ విద్యుత్ స్తంభానికి విద్యుత్ ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని రేవంత్ గమనించే అవకాశం లేకపోయింది.
కుక్క గొలుసు చేతిలో పట్టుకుని నడుస్తున్న సమయంలో.. అనుకోని రీతిలో గొలుసు విద్యుత్ స్తంభానికి తగిలింది. దీంతో విద్యుత్ షాక్ తో రేవంత్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. రాత్రి 11గం. దాటడంతో ఆ సమయంలో అక్కడ పెద్ద జనసంచారం లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి అటుగా వెళ్తున్నవారు రేవంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రేవంత్ పడి ఉన్న ప్రాంతానికి వచ్చిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే రేవంత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే అహ్మద్పాషా ఖాద్రి, వివిధ పార్టీల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ స్తంభానికి షాక్ వస్తున్నా.. పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రభుత్వం బాధితునికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.