వరంగల్ లో ఆ ఇద్దరు నేతల ఆదిపత్యం..! ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే..!!
Recommended Video
హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఊహకందని ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు రాజకీయాల్లో యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. ఈనేపథ్యంలోనే బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లు అవుతాయి..! సరిగ్గా ఇలాంటి ఘటనే పోరాటాల పురిటి గడ్డ వరంగల్ అడ్డాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆ ఇద్దరు సీనియర్ నేతల రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతోంది. గత ప్రభుత్వంలో ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చక్రం తిప్పితే, మరొకరు ఎమ్మెల్యేగా కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉల్టా పటాయించింది. అప్పుడు చక్రం తిప్పిన నేత సైలెంట్ అయ్యారు.., సైలెంట్ గా ఉన్న నేత ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరంలేదనే చర్చకూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
టీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతలు..! చక్రం తిప్పిన, తిప్పుతున్న నేతలు..!!
ప్రస్తుతం వరంగల్ రాజకీయాలు ఈ ఇద్దరి నేతల చుట్టే తిరుగుతున్నాయి. వీరి వ్యవహారంపై చర్చ కూడా వాడివేడిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరని అనుకుంటున్నారా..? వారు మరెవరో కాదు. మనకు బాగా సుపరిచితమైన కడియం శ్రీహరి - ఎర్రబెల్లి దయాకర్ రావు. వీరిద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎదిగిన నేతలే. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కడియం శ్రీహరి మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు కేవలం ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే, ఇక్కడ ఎర్రబెల్లి మాత్రం వరుసవిజయాలతో తిరుగులేని ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం తర్వాత కడియం శ్రీహరి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా గెలిచారు.
రాజకీయాల్లో కీలక పాత్రలు..! మారుతున్న అదికారం..!!
ఇక పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి టీడీపీ ఎమ్మెల్యేగా అతికష్టంగా గెలుపొందారు. ఆ తర్వాత ఎర్రబెల్లి కూడా బంగారు తెలంగాణ కోసం అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అప్పుడు తెలంగాణ మొదటి డిప్యూటీ సీఎం - స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్యను కొద్ది నెలలకే సీఎం చంద్రశేఖర్ రావు తొలగించి, ఏకంగా కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశారు. నిజానికి, అప్పట్లో ఇది పెద్ద సంచలన నిర్ణయంగా మారింది. కడియంను ఎంపీ పదవికి రాజీనామా చేయించి, ఎమ్మెల్సీగా పదవిని కట్టబెట్టారు చంద్రశేఖర్ రావు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత హడావుడి చేశారు.
గతంలో కడియం క్రియాశీల పాత్ర..! ఇప్పుడు చక్రం తిప్పుతున్న ఎర్రబెల్లి..!!
ఇక ఇదే సమయంలో ఎర్రబెల్లి మాత్రం కేవలం పాలకుర్తి నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. మరో నియోజకవర్గంలో అడుగుకూడా పెట్టలేదు. 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి భారీ మెజార్టీతో గెలుపొందారు. చంద్రశేఖర్ రావు మొదటి మంత్రివర్గంలో ఎర్రబెల్లి స్థానం సంపాదించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి ఒక్కడికే మంత్రి పదవి లభించింది. ఇక ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయనదే హవా నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఏర్పడిన ఆరు జిల్లాల్లోనూ ఎర్రబెల్లిదే పెత్తనం. హైదరాబాద్ లోనూ సమీక్షలతో హల్ చల్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు గతంలో కడియం శ్రీహరి కనుసన్నల్లో నడిచేవి.
తొలిసారి మంత్రి పదవి చేపట్టిన ఎర్రబెల్లి..! ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నీ తానై నడిపిస్తున్న దయాకర్..!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమమైనా ఎర్రబెల్లి చేతులమీదుగా జరగాల్సిందే. ఇక ఇదే సమయంలో ఒకప్పుడు చక్రం తిప్పిన కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుక సైలెంట్ గా నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లేందుకు కడియం సిద్ధంగా ఉన్నారనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అయినా ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. పార్టీ - ప్రభుత్వ కార్యక్రమాల్లో కడియం అంత చురుగ్గా ఉండకపోవడంతో ఆ ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. ఏదిఏమైనా, తాను మంత్రి కావాలన్న ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన చంద్రశేఖర్ రావు వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ఎర్రబెల్లి తెగ ప్రయత్నాలు చేస్తుండగా, కడియం మాత్రం ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉండిపోతున్నారు. ఉన్నతి శిఖరాలను అధిరోహించిన కడియం ఛరిష్మా మసకబారుతందనడానికి ఇదే ఉదాహరణ కాగా పడిలేచిన కెరటానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదహారణగా చర్చ జరుగుతోంది.