బాబుకు రేవంత్ రెడ్డి షాక్!: పదేళ్లుంటామని సోమిరెడ్డి కౌంటర్
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు! తెలంగాణలో జడ్జిలు, లాయర్ల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్లు రేవంత్ ప్రకటించారు.
హైకోర్టు విభజన వంటి అంశాల పైన కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రం జోక్యం చేసుకోకుంటే ప్రాంతీయ వైషమ్యాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబును విమర్శించడం సరికాదని మాత్రం వ్యాఖ్యానించారు.
హైకోర్టు విభజన జాప్యం వెనుక చంద్రబాబు లేడని చెప్పే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి చేశారు. హైకోర్టు విభజన రెండు రాష్ట్రాల మధ్య వివాదం కావడంతో.. రేవంత్ రెడ్డి తెలంగాణ జడ్జిలకు, న్యాయవాదులకు మద్దతు పలికారు.
మాకు పదేళ్లు హక్కు: సోమిరెడ్డి
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని, తమకు పదేళ్ల పాటు హక్కు ఉంటుందని టిడిపి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెరాసకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంటును ఇంకా క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
షెడ్యూల్ 9, 10 ఆస్తుల పంపకాలు, విభజన, నీటి పంపకాలు ఇంకా పూర్తి కాలేదని సోమిరెడ్డి పాయింట్ లాగారు. హైకోర్టు విభజనను మాత్రం రాజకీయం చేస్తున్నారని తెరాస పైన మండిపడ్డారు. తెరాస కుట్రలో లాయర్లు, జడ్జిలు భాగం కావొద్దని హితవు పలికారు.
హైకోర్టును ఎందుకు తరలించట్లేదు: వైసిపి శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ నుంచి అన్ని కార్యాలయాలను అమరావతి తరలించిన చంద్రబాబు హైకోర్టును మాత్రం ఎందుకు తరలించడం లేదని వైసిపి నేత శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ రాస్తే రాయలసీమకు హైకోర్టు వస్తుందన్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో చేసే ప్రజాదోపిడీకి వ్యతిరేకమన్నారు.