కరోనాకు అదొక్కటే మందు, బాధితులను ఒంటరి చేయొద్దు: మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్: కరోనా మహమ్మారి పట్ల భయాందోళనలు గురికావాల్సిన అవసరం లేదని.. అయితే ఆ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్లాస్మా దానం కార్యక్రమానికి హాజరయ్యారు.
Recommended Video
ప్లాస్మా థెరపీతో ధైర్యం వచ్చింది..
ఈ సందర్భంగా ప్మాస్మా దానం చేసేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన donateplasma.hcsc.in వెబ్సైట్ను మంత్రి ఈటెల ప్రారంభించారు. ప్లాస్మాదానం చేయాలనుకునేవారు 94906 16780, 040-23434343 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చిందని, కరోనా ఔషధాలతోపాటు ప్లాస్మా చికిత్స ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందన్నారు. అన్ని ఆస్పత్రుల్లోనూ కరోనాతోపాటు ఇతర వ్యాధులకు చికిత్స అందించాలని అన్నారు.
కరోనాకు అదొక్కటే మందు..
కరోనాకు మందు లేదని.. ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏకైక మందు ధైర్యమేనని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా బాధితులకు మనోధైర్య కల్పించేలా నడుచుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాకు ఇప్పటి వరకు మందు లేదని, ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమని అన్నారు. కరోనా బాధితుల ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిల్లాడుతుంటే మనం సమన్వయంతో ఎదుర్కొంటున్నామని మంత్రి తెలిపారు. భూమీ మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకుని జీవిస్తుంటే.. మనిషి మాత్రం ప్రకృతిని శాసించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
కరోనా రోగులను ఒంటరివారిని చేయొద్దు..
ఒకరికొకరు సాయంగా ఉండాలనే విషయాన్ని కరోనా గుర్తు చేసిందన్నారు. వైద్యులు ఎంతో సాహసంతో చికిత్స చేస్తూ దేవుళ్ల స్థానంలో నిలిచారని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల కుటుంబసభ్యులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో కరోనా రోగులకు పోలీసులు అన్ని విధాలుగా తోడుగా ఉండటం ప్రశంసనీయమని అన్నారు. కరోనాకు భయపడి ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవడం సరైంది కాదన్నారు.
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త..
ఇది ఇలావుండగా, మరోవైపు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులపై మంత్రి ఈటెల వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలతో సమన్వయం చేసుకుని సీజనల్, అంటు వ్యాధులపై నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.