మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా, సీట్లు అడగకండి: టీటీడీపీ నేతలతో చంద్రబాబు
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
షాకింగ్: 'అంతర్యుద్ధం, టీఆర్ఎస్-కూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి'
సీట్లు ముఖ్యం కాదు, తెరాస ఓటమి ముఖ్యం
తెలంగాణ టీడీపీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించే అవకాశముంది. ఏఏ స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 14 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ తెలంగాణ టీడీపీ నేతలు 17 వరకు కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధినేత ముందు వారు ఉంచారు. అయితే ఎక్కువ సీట్లలో పోటీ చేయడం మన లక్ష్యం కాదని, ఇచ్చిన సీట్లలో గెలవడం ముఖ్యమని, అదే విధంగా టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని చెప్పారని తెలుస్తోంది.
అసంతృప్తులతో నేను మాట్లాడుతా
టిక్కెట్ల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉందని, ఆశావహులు చాలామంది ఉన్నారని, టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయని తెలంగాణ టీడీపీ నేతలు అధినేతకు చెప్పారు. అయితే మనకు కాంగ్రెస్ ఇచ్చిన స్థానాలు తీసుకోవాలని, మిగతా చోట్ల అసంతృప్తులు ఉంటే తాను స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. కానీ మనకు సీట్ల సంఖ్య మాత్రం ముఖ్యం కాదని చెప్పారు. గతంలోను ఇదే విషయాన్ని చెప్పారు.
ఎన్నికల్లో పోటీపై తీవ్ర ఒత్తిడి
ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉందని నేతలు ఆయనకు చెప్పారు. అయితే, ఇప్పుడు మనకు టిక్కెట్లు ఏమాత్రం ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి, కూటమి గెలుపు చాలా ముఖ్యమని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఎన్నికలు మేలు చేస్తాయని అధినేత చెప్పారు. మరింత వివరంగా చర్చించేందుకు తనతో పాటు బెంగళూరుకు రావాలని ఎల్ రమణ, రావులకు చంద్రబాబు సూచించారు. దీంతో అధినేతతో పాటు వెళ్లనున్నారు.
శుక్రవారం మరోసారి భేటీ
ఈ రోజు రాత్రి ఏడున్నర గంటలకు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రేపు (శుక్రవారం) మరోసారి తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమరావతిలో చర్చలు ముగిశాయి. బెంగళూరుకు వెళ్తుండగా ఈ అంశంపై చర్చించే అవకాశముంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి చర్చించనున్నారు.
ఈ సీట్ల కోసం టీడీపీ పట్టు
తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే మరో మూడు సీట్లు కావాలని తెలంగాణ టీడీపీ కోరుతోంది. చంద్రబాబు మాత్రం వారిస్తున్నారు. ఎల్బీనగర్, కోదాడ, కొత్తగూడెం టిక్కెట్లు మనకే కావాలని వారు అధినేతకు చెబుతున్నారు. ఎల్బీ నగర్ సహా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే మన గెలుపే సులభమని వారు చెబుతున్నారు. ఈ అంశాలన్నింటిపై చంద్రబాబు ఈ రోజు రాత్రి, రేపు చర్చించనున్నారు.