నా ఇష్టానికి విలువలేదా?: తండ్రికి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి
హైదరాబాద్: తండ్రి కోరుకున్నట్లుగా హాస్టల్లో చదవడం ఇష్టం లేని ఓ యువతి ఇల్లు వదిలి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్లో చోటు చేసుకుంది. పద్మాలయ అంబేడ్కర్ నగర్లో నివసించే అప్పారావు అపోలో ఆసుపత్రిలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఆయన 18 ఏళ్ల కుమార్తె దీపిక. ఆమె ఇంటర్ పూర్తి చేసింది.
డిగ్రీ కోసం ఆమెను గురుకులలో చేర్చాలని భావించిన తండ్రి, అందుకు ఫీజు కూడా కట్టాడు. బుధవారం ఆమెను హాస్టల్లో దింపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ అంతలోనే ఆమె తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయింది.
ఇంట్లో నా ఇష్టానికి విలువలేదని, ఆడపిల్లననే కారణంతోనే ఇలా చేస్తున్నారని, తనకు ఇష్టం లేకుండా హాస్టల్లో వేయాలని అనుకుంటున్నారని, సారీ డాడీ.. నిన్ననే నేను ఫాదర్స్ డే కోసం కేక్ తెచ్చి తినిపించాను.. కానీ ఆ సంతోషం ఇప్పుడు నాలో లేదు, నేను వెళ్లిపోతున్నాను.. ఇక్కడ ఉండలేను అంటూ ఆమె లేఖ రాసి అదృశ్యమైంది.
కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. దీపికకు ఇంటివద్దే ఉండి చదువుకోవాలని కోరిక. హాస్టల్లో ఉండాల్సి వస్తుందని మూడు రోజులుగా దీపిక బాధపడుతోంది.సోమవారం తల్లిదండ్రులుపెద్దమ్మ గుడికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న దీపిక రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఇంటికి వెళ్లాక ఆ లేఖ చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రి అప్పారావు మాట్లాడుతూ... తన కుమార్తెను మంచిగా చదివించాలనే కోరికతో ఎంతో కష్టపడి గురుకుల కళాశాలలో సీటు సంపాదించామని చెప్పారు. తన కుమార్తెకు అక్కడ ఉండి చదవడం ఇష్టం లేని విషయం తమకు తెలియదన్నారు. తెలిస్తే తమ ఆమె మాటకే విలువ ఇచ్చేవారమన్నారు.