వేతనాలు చెల్లించాల్సిందే.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించవద్దు : పరిశ్రమలకు కేటీఆర్ ఆదేశం
కరోనా లాక్ డౌన్ కారణంగా పేదలు,మధ్యతరగతి జీవులు విలవిల్లాడిపోతున్నారు. కంపెనీలు మూతపడటంతో దినసరి కూలీలు,నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులు సతమతమవుతున్నారు. కుటుంబ పోషణ,ఇంటి అద్దెలు ఇప్పుడు వారికి తలకు మించిన భారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మరోసారి పరిశ్రమల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి పరిశ్రమల శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు.
Recommended Video
ఈ విపత్కర సమయంలో ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగింవద్దన్నారు. ఉద్యోగులకు యాజమాన్యాలు అండగా నిలవాలన్నారు. ప్రతీ పరిశ్రమ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందేనని చెప్పారు. సడలింపు ఇచ్చిన వ్యవసాయధారిత పరిశ్రమలు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 30-40శాతం సామర్థ్యంతో నిర్వహించాలని... ఇందుకోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని చెప్పారు. పని ప్రదేశాల్లోని కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈఎస్ఐ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ప్రైవేట్ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గత ప్రెస్మీట్లలో పరిశ్రమల యాజమాన్యానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు యాజమాన్యాలు అండగా నిలవాలని.. జీతాలు చెల్లించాలని చెప్పారు. అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నవారిని కాంట్రాక్టర్లు,బిల్డర్లు ఆదుకోవాలని చెప్పారు. ఇంటి అద్దెల కోసం ఒత్తిడి చేయవద్దంటూ ఆదివారం(ఏప్రిల్ 19) నాటి ప్రెస్మీట్లో ఇళ్ల యజమానులను కూడా హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా అద్దె కోసం ఒత్తిడి చేస్తే 100కి ఫోన్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 486,నిజామాబాద్లో 58 కేసులు నమోదయ్యాయి.