పీవీ గొప్ప సంస్కర్త కాదు, విధిలేకే చేశారు: అరుణ్ జైట్లీ ఆసక్తికరం
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావు పైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవీని ఆర్థిక సంస్కరణవాది అనడంపై జైట్లీ అనుమానం వ్యక్తం చేశారు. నెహ్రూ ఆర్థిక విధానాలు విఫలమైన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పీవీ సంస్కరణలు చేపట్టారన్నారు.
దేశాన్ని ఆర్థిక దివాలా నుంచి రక్షించేందుకు పీవీ.. నెహ్రూ ఆర్థిక విధానాల భావజాలం నుంచి బయటపడ్డారన్నారు. పీవీ పెద్ద ఆర్థిక సంస్కరణవాది కాదని, ఆర్థిక విధానాలకు సంబంధించి గొప్ప ఉదారవాదీ కాదన్నారు.
ఆయన ఏపీ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీలని రద్దు చేసి, ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించారని గుర్తు చేశారు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి ఖజానాలో చిల్లిగవ్వ విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవని, విదేశీ అప్పులు చెల్లించలేక దేశం దివాళా దిశగా ప్రయాణిస్తోందని, అప్పుడు తప్పనిసరిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. నెహ్రూ ఆర్థిక విధానాలపై మండిపడ్డారు.
1950, 60ల్లో మన వద్ద ఉన్న వనరులు చాలా పరిమితమని, ఆ తర్వాత రెండు దశాబ్దాలూ వృథా అయ్యాయన్నారు. ఆ సమయంలో మన వృద్ధి రేటు ఒకటి రెండు శాతానికి మించి లేదన్నారు. జపాన్, కొరియా, తైవాన్లు ఆర్థిక రంగంలో విజయం సాధించినా మనం మాత్రం నెహ్రూ విధానాల కారణంగా ప్రభావితమయ్యామన్నారు.
కొన్ని పనుల్ని ప్రభుత్వమే చేయగలదనే భావనతో ఉండేవాళ్లమన్నారు. ఫోన్ కనెక్షన్లే దీనికి ఉదాహరణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి 50 ఏళ్లలో దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందికే ఫోన్లు ఉన్నాయన్నారు. ప్రయివేటు ఆపరేటర్లు వచ్చాక ఇరవై ఏళ్లలో అది 80 శాతానికి పెరిగిందన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నెహ్రూ తరహా ఆలోచనల నుంచి మన దేశం బయటకు వచ్చిందన్నారు.
కాంగ్రెస్ ఆగ్రహం
పీవీపై అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవికంగా ఉన్నాయని కాంగ్రెస్ ఖండించింది. ఇవి పక్షపాతంతో కూడినవని విమర్శించింది. ఇలాంటి కువిమర్శలు చేసే బదులు యూపీఏ పాలనలో సాధించిన వృద్ధిని ఎన్డీఏ ఎందుకు కొనసాగించలేకపోతోందో జైట్లీ వివరించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశాలతో పీవీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నెహ్రూ వల్లనే దేశానికి సాధికారత లభించిందన్నారు.