'చంద్రబాబూ! నోరు అదుపులో పెట్టుకో, డికె అరుణలా గూండాలంకాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు గురువారం నిప్పులు చెరిగారు. అసెంబ్లీని చంద్రబాబు తాత కట్టారా అన్నారు.
తెలంగాణ ప్రజలను అవమానించేలా చంద్రబాబు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో బల్బు కూడా వెలగనప్పుడే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి జరిగిందని తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీ భవనం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
అసెంబ్లీని వాళ్ల తాత కట్టించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన తర్వాతనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఆర్డీఎస్ను పగులగొడతానని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డికె అరుణ పౌరుషం ఎక్కడకు పోయిందని వారు నిలదీశారు.
డికె అరుణ రౌడీలు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆమె తన స్వలాభం కోసమే తప్ప మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కోసం, అక్కడి నుండి వలస పోతున్న వారి నివారణ కోసం ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు.
హైదరాబాదులో చారిత్రక కట్టడాలు అంతకుముందే జరిగాయన్నారు. హుస్సేన్ సాగర్ మంచినీటిగా ఉండేదని, ఆంధ్రా పాలన వచ్చాక మురుగునీటిగా మారిందన్నారు. తమ జోలికొస్తే చంద్రబాబుకు బుద్ధి చెబుతామన్నారు. సీమాంధ్రలో అక్రమంగా కట్టిన ప్రాజెక్టులకు డికె అరుణ హారతి ఇచ్చారన్నారు.
పాలమూరు ప్రజల పట్ల డికె అరుణ వైఖరిని తాము ప్రశ్నించామన్నారు. తాము తురుంఖాన్లం కాకపోవచ్చునని కానీ, అరుణలా గూండాలం మాత్రం కాదన్నారు. డికె అరుణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.