12న తుది జాబితా, నోటిఫికేషన్ విడుదల చేస్తాం, వారికే ఓటు హక్కు: హైకోర్టుకు ఈసీ
Recommended Video
హైదరాబాద్: ఓటర్ల జాబితాలో ఫిర్యాదుల పైన హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఎల్లుండికి (బుధవారం) వాయిదా వేసింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను పొందుపర్చింది.
సమాధానం చెప్పాలి: ఓటర్ల జాబితాపై హైకోర్టు, చంద్రబాబును కేసీఆర్ అలా అంటారా: మర్రి
బోగస్ ఓట్లను తొలగించినట్లు కోర్టుకు ఈసీ తెలిపింది. టెక్నాలజీ సహాయంతో 30 లక్షల బోగస్ ఓట్లు ఎత్తివేశామని పేర్కొంది. ఈ నెల 12వ తేదీన తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ విడుదల చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది.
జాబితాలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది. ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో బుధవారం దీనిపై విచారణ జరగనుంది.
కాగా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, ఓట్ల అవకతవకలపై గత శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు కాపీ అందిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. నాలుగు పిటిషన్లకు గాను హైకోర్టు రెండు పిటిషన్లను కొట్టి వేసింది. కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు కొనసాగాయి. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈసీ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది.