హైదరాబాద్కు ఇవాంకా, సామాన్యులకు చుక్కలు: 'ఇళ్ల నుంచి బయటకు రావొద్దు', టెక్కీలకూ
గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్ సదస్సుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్ సదస్సుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చదవండి: అంతా అబద్దం: ఇవాంకా 'ఖర్చు'పై కేటీఆర్
ఇవాంకా వస్తున్నారు, బయటకు రాకండి
ఇవాంకా వస్తున్నారని, ఆమె వచ్చే రోజున ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, అత్యవసర పనులుంటే తమకు చెప్పాలని ఫలక్నుమా ప్యాలెస్, మాదాపూర్లోని వెస్టిన్ హోటల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
ఇవాంకా ట్రంప్ వస్తుండటంతో భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. వెస్టిన్ హోటల్కు నలువైపులా కిలోమీటరు దూరం వరకూ ఉన్న వ్యాపార సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ సంస్థల యజమానులు, ప్రతినిధులతో మాదాపూర్ పోలీసులు శనివారం సమావేశమయ్యారు.
భద్రతా ఆంక్షలు ఉంటాయి
ఇవాంకా ట్రంప్ వెస్టిన్ హోటల్లో బస చేస్తున్న నేపథ్యంలో మూడురోజుల ముందు నుంచి భద్రతపరమైన ఆంక్షలుంటాయని, అందరూ సహకరించాలని పోలీసులు ఫలక్నుమా ప్యాలెస్, మాదాపూర్ వెస్టిన్ హోటల్ పరిసర ప్రాంతాల వారికి చెప్పారు. ఫలక్నుమా ప్యాలెస్లో ఈ నెల 28న ప్రధాని మోడీ, ఇవాంకా, జీఈఎస్ సదస్సు ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మండలం పోలీసులు వట్టేపల్లి, సాదిక్నగర్, ఫాతిమా నగర్, ఫలక్నుమా ప్రాంతాల్లో శనివారం పరిశీలించారు.
వారి వివరాలు సేకరించిన పోలీసులు
ఆయా ఇళ్లల్లో నివసిస్తున్న వారి పేర్లు, సెల్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేశారు. ప్రతి ఇంట్లో ఎందరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, విదేశాల్లో ఎవరైనా ఉన్నారా తదితర వివరాలు సేకరించారు. గత కొద్ది రోజులుగా తెలియని వారికి ఎవరికైనా ఇల్లు అద్దెకు ఇచ్చారా, ఈ మధ్య ఎవరైనా బంధువులు వచ్చారా తదితర విషయాలు ఆరా తీస్తున్నారు. కొత్తగా వచ్చిన వారి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పారు.
ఐటీ ఉద్యోగుల వివరాలు సేకరించారు
మరోవైపు, వెస్టిస్ హోటల్ ప్రాంతంలో ఫెడరల్ బ్యూరో బృందం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. రహేజా ఐటీ పార్కులో ఉన్న వెస్టిన్ హోటల్కు మూడువైపులా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే కసరత్తు ముమ్మరం చేసింది. రహేజా ఐటీ పార్కులోని సాఫ్టువేర్ ఉద్యోగుల వివరాలను సేకరించారు.
కొత్త ఉద్యోగులను తీసుకుంటే మాకు చెప్పండి
ఐటీ సంస్థలు వినియోగిస్తున్న వెహికిల్స్ నెంబర్లను తీసుకున్నారు. ఇవాంకా పర్యటన పూర్తయ్యేంత వరకూ కొత్త ఉద్యోగులను చేర్చుకున్నా, మరమ్మతులు చేపట్టినా, వాహనాలను మార్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఐటీ సంస్థలకు చెప్పారు.
ప్రత్యేక డాగ్ స్క్వాడ్
ఫలక్నుమా ప్యాలెస్ భద్రత కోసం గ్రేహౌండ్స్, అక్టోపస్ బృందాలు ఈ నెల 25న నగరానికి రానున్నాయి. వెస్టిన్ హోటల్ను అమెరికా భద్రతాధికారులు వారం ముందే స్వాధీనం చేసుకుంటారని పోలీసులు తెలిపారు. కాగా, ప్రత్యేక డాగ్ స్క్వాడ్ కూడా రానుంది.