వేధింపులు, భర్త అక్రమ సంబంధం: వివాహిత ఆత్మహత్య?, నట్టింట్లోనే పూడ్చేశారు
అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, తన కూతురును అత్తింటి వారే హత్య చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వరంగల్: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, తన కూతురును అత్తింటి వారే హత్య చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాక, ఆమె మృతదేహాన్ని అత్తింట్లోనే పాతిపెట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎనుమాములలో చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా సోమారానికి చెందిన యాకయ్య తన కూతురు రాధికను(29) వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాములకు చెందిన విజయ్కుమార్కు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో బంగారం, వెండితో పాటు రూ.3.5 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు.
కాగా, ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. మొదటి పాప పుట్టినప్పుడు స్థలాన్ని కొనిచ్చారు. రెండో అమ్మాయి పుట్టినప్పుడు మరో రూ.3 లక్షలు చెల్లించినట్లు మృతురాలి తండ్రి యాకయ్య చెప్పారు. ఎనిమిది నెలల క్రితం బాబు మన్విత్ జన్మించాడు. కొడుకు పుట్టినా వేధింపులు ఆపకపోవడంతో పాటు భర్త, అత్త, కుటుంబ సభ్యులు రాధికను హింసించడం ఎక్కువ చేశారు.
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు తన కుమార్తెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న యాకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మరిన్ని గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి రాధిక ఉరేసుకుని మృతిచెందినట్లు అత్తింటివారు సమాచారం ఇవ్వడంతో బంధువులతో కలిసి యాకయ్య ఎనుమాములకు వెళ్లారు.
తన కూతురు మరణించడంతో ఆగ్రహంతో యాకయ్య, అతని బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో విజయ్ కుమార్, బంధువులు కూడా ఎదురుదాడికి దిగారు. ఆ తర్వాత మృతురాలి భర్త, అత్తింటి వారు ఇంటికి తాళం వేసుకుని పారిపోయారు. మృతురాలి పిల్లల పేరిట ఆస్తిని రాసివ్వాలని కోరగా అత్తింటి వారు నిరాకరించడంతో ఆగ్రహించిన బంధువులు.. మృతదేహాన్ని అత్తవారింట్లోకి తీసుకెళ్లారు. నట్టింట్లో గుంత తవ్వి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టారు. స్థానికులు కూడా వారికి మద్దతుగా నిలిచారు.