షాకింగ్ : రోడ్డుకు సమీపంలో కుప్పలుతెప్పలుగా పాములు... షాక్ తిన్న స్థానికులు...
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ కలుగులో కుప్ప తెప్పలుగా పాములు బయటపడ్డాయి. మొదట ఒక పాము అందులో నుంచి బయటకు రాగా స్థానికులు చంపేశారు. ఆ తర్వాత మరో పాము బయటకు వచ్చింది. దాన్ని కూడా స్థానికులు చంపేశారు. కానీ ఆ తర్వాత కూడా అందులో నుంచి పాములు బయటకొస్తూనే ఉండటంతో వారు బెదిరిపోయారు. ఏంటా అని కాస్త ఆ కలుగులోకి తొంగిచూస్తే లోపల పాముల కప్పు కనిపించి షాక్ తిన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటాపురం బస్టాండ్ ప్రధాన రహదారిలోని మంగలి లక్ష్మన్న బంక్ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంది. దాన్ని పక్కనే భూమిలోకి చిన్నపాటి రంధ్రం ఉంది. అందులో నుంచి మొదట ఓ పాము పిల్ల బయటకు రావడంతో స్థానికులు కొట్టి చంపేశారు. కానీ ఆ తర్వాత కాసేపటికి అదే కలుగులో నుంచి మరో పాము వచ్చింది. స్థానికులు దాన్ని కూడా చంపేశారు. కానీ ఆ తర్వాత కూడా వరుసబెట్టి ఆ కలుగులో నుంచి పాములు బయటకొస్తూనే ఉన్నాయి.దీంతో స్థానికులు బెదిరిపోయారు.
ఆ కలుగు వద్దకు వెళ్లి కాస్త పరిశీలించి చూడగా లోపల కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. వెంటనే వాటన్నింటినీ చంపేసి పక్కనే ఉన్న పొదల్లో కాల్చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలను కొంతమంది సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొంతమంది జంతు ప్రేమికులు స్థానికుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాములు కనిపిస్తే స్నాక్ క్యాచర్స్కి లేదా అటవీ అధికారులకు సమాచారమివ్వాలని... అంతే తప్ప ఇలా చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పాములు సంచరిస్తే ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని... అందుకే వాటిని చంపేశామని స్థానికులు చెప్తున్నారు.
గతంలోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. రెండేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్పూర్ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న బండ కింద పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటపడ్డాయి. మొదట ఓ పాము పిల్ల బయటకు రాగా ఆ ఇంటి యజమాన్ని దాన్ని చంపేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో పాము బయటకొచ్చింది. దీంతో అనుమానం వచ్చి ఆ బండరాయిని పక్కకు తొలగించి చూడగా... దానికింద పదుల సంఖ్యలో పాములు కనిపించాయి.