ఇక లైన్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్: మూడో విడత ట్రయల్స్ కోసం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీనికోసం అవసరమైన వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. దేశవ్యాప్తంగా 13 నగరాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్, విజయవాడ ఈ నగరాల జాబితాలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తొలివిడత వ్యాక్సినేషన్ వినియోగించనున్నారు. కోవిషీల్డ్ను పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. అక్కడి నుంచే వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు సరఫరా అవుతోంది.
తాజాగా- ఇదే జాబితాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ చేరబోతోంది. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను తయారు చేసే కాంట్రాక్ట్ను హైదరాబాదీ ఫార్మాసూటికల్స్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తీసుకుంది. ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్పై ఇప్పటికే రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి క్లినికల్, సేఫ్టీ డేటాను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ యాజమాన్యం డీసీజీఐకి అందజేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి మంజూరు చేయాలని కోరింది.
Recommended Video
మూడో విడతలో 31 వేల మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ను నిర్వహించబోతోన్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. రెండో విడతకు సంబంధించిన క్లినికల్, సేఫ్టీ డేటాను డీసీజీఐకి అందజేశామని, మూడో విడత కోసం అనుమతి కోరామని పేర్కొన్నారు. రెండో విడత క్లినికల్ ట్రయల్స్..ఆశించినదాని కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని వివరించారు. ప్రస్తుతం రష్యా,అర్జెంటీనాల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగంలో ఉందని చెప్పారు. రష్యాలో 10 లక్షలమంది, అర్జెంటీనాలో మూడు లక్షల మంది జనాభకు పైగా ఈ వ్యాక్సిన్ అందజేశారని అన్నారు.