చంద్రకళని మళ్లీ విచారిస్తాం, డా.శశికుమారే వారిని పిలిచాడు: డిసిపి
హైదరాబాద్: డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు, డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి బుధవారం నాడు చెప్పారు. ఈ రోజు చంద్రకళను విచారిస్తామని ఆయన వెల్లడించారు. ఆమెను ఓసారి విచారించామని, మరోసారి విచారిస్తామన్నారు.
డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని చెప్పారు. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. శశికుమార్ ఫాంహౌస్లో కాల్చుకున్నట్లు తేలిందన్నారు.
ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి విషయం వెల్లడైందని చెప్పారు. ఉదయ్ శరీరంలో తూటాలకు చెందిన కొన్ని పిల్లెట్స్ మిగిలాయని, వాటిని ఎస్ఎఫ్ఎల్ నివేదికకు పంపించామన్నారు. కాల్పుల ఘటన కేసు దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.
భాగస్వాములను శశికుమారే మాట్లాడుకునేందుకు పిలిచినట్లుగా తెలుస్తోందని వెల్లడించారు. అయితే విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. దారిలో ఉన్న బ్లూఫాక్స్ హోటల్లో కూర్చున్నారన్నారు. సాయంత్రం ఆరు గంటలకు శశికుమార్.. చంద్రకళ ఇంటికి వెళ్లారని, ఆమెనే అతనిని ఫాంహౌస్లో విడిచి పెట్టారన్నారు. చంద్రకళ ప్రమేయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు రాలేదన్నారు.
కాగా, తోటి వైద్యుడు ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
ఉదయ్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని, ఉదయ్ చనిపోయాడని భావించాడని, ఆ భయాందోళనలోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. మరో డాక్టర్ సాయికుమార్ను పోలీసులు ప్రశ్నించారు. సూసైడ్ నోట్లో పెర్కొన్న ఆరోపణల కోణంలోను పోలీసులు విచారణ జరుపుతున్నారు.