డ్రగ్ రాకెట్ షాకింగ్: సైంటిస్ట్ తర్వాత.. బేగంపేట ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగరంలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ రాకెట్లో అధికారులు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సైంటిస్ట్ వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వెంకటరమణ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సైంటిస్ట్ వెంకటరమణ హైదరాబాద్ శివార్లలో మూతబడ్డ కంపెనీని లీజుకి తీసుకుని, వందల కేజీల డ్రగ్స్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.
వెంకటరమణ ఇంటి నుంచి 30 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ డ్రగ్ పైన లోతైన దర్యాప్తు చేపడుతున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఇతను వింగ్ కమాండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనిని హైదరాబాద్ తరలించారు.
అధికారులు.. రాజశేఖర రెడ్డి నుంచి రూ.10 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను ప్రతి మూడు నెలలకు ఓసారి డ్రగ్ రాకెట్ తయారీని పరిశీలించేవారని గుర్తించారని తెలుస్తోంది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టుతున్నారు.