భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: రూ. వందల కోట్ల డ్రగ్స్ సీజ్, శాస్త్రవేత్త అరెస్ట్
హైదరాబాద్/బెంగళూరు: హైదరాబాద్ నగరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ను నార్కొటిక్ విభాగానికి చెందిన(ఎన్సీబీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యాంఫెటమైన్ అనే డ్రగ్స్ విలువ సుమారు రూ. 45కోట్లకుపైగా విలువ ఉంటుందని అంచనా.
డయేరియా మందు పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ శాస్త్రవేత్తతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందిత శాస్త్రవేత్త నివాసం నుంచి రూ. 1.23కోట్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. డయేరియాకు మందు పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్న ప్రముఖ సంస్థలో పరిశోధక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకట రమణారావు (37)ను సెప్టెంబర్ 30వ తేదీన పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. తనతోపాటు వ్యాపారంలో ఉన్న రవిశంకర్ రావు (22) నుంచి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు.
కాగా, వారి వద్ద ఆ సమయంలో ఉన్న దాదాపు 221 కిలోల యాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. తన ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నాయని విచారణలో రమణారావు వెల్లడించాడు. బెంగళూరులోని అతడి ఇంటిని గాలించగా.. వెంకట రమణారావు భార్య ప్రీతి (35) మరో 30 కిలోల యాంఫెటమైన్ను దాచి ఉంచినట్లు తేలింది. దీన్నే అతడు బయ్యర్లకు శాంపిల్గా ఇచ్చేవాడు.
డ్రగ్స్ వ్యాపారంలో వెంకట రామారావుకు ఆయన భార్య కూడా సహకరించినట్లు తెలుస్తోంది. కాగా, నిందిత శాస్త్రవేత్త ఇంట్లో మరో ఉన్న రూ. 1.23 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ డ్రగ్ను ప్రాసెస్ చేస్తున్న ఓ ల్యాబ్ నుంచి ఇంకో 10 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలామంది హస్తం ఉండి ఉంటుందని, ఇది ఒకరిద్దరి వల్ల అయ్యేది కాదని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
మానసిక వైద్య చికిత్సలో భాగంగా యాంఫెటమైన్ను ఉపయోగిస్తారు. కానీ, దాన్ని డ్రగ్గా ఇటీవలి కాలంలో భారతీయ యువత విచ్చలవిడిగా వాడుతున్నట్లు నార్కొటిక్స్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ను ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు భారతదేశం నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఓ భారీ డ్రగ్ నెట్వర్క్ నడుస్తోందని వెల్లడించారు. సీజ్ చేసిన మొత్తం డ్రగ్స్ విలువ సుమారు వందల కోట్లలో ఉంటుందని సమాచారం.
వెంకట రమణే ప్రధాన నిందితుడు
డ్రగ్స్ రాకెట్లో శాస్త్రవేత్త వెంకట రమణారావే ప్రధాన నిందితుడని ఎన్సీబీ రీజనల్ ఇంఛార్జ్ సిన్హా తెలిపారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి వెంకట రమణారావు డ్రగ్స్ స్మగ్లింగ్ను కొనసాగించాడని వివరించారు.
ఇప్పటికే సదరు ఎయిర్ ఫోర్స్ అధికారులను కూడా అదుపులోకి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెంకట రమణారావుతోపాటు ఆయన భార్య, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠా డ్రగ్స్ ను మలేషియా, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తోందని సిన్హా తెలిపారు. ఈ డ్రగ్స్ వ్యాపారం వందల కోట్లలో జరుగుతోందని చెప్పారు. కాగా, డ్రగ్స్ అక్రమ రవాణాలో కొంత మంది పెద్దల హస్తం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.