హైదరాబాదులో డ్రగ్ రాకెట్: 21 మంది విఐపిలకు లింక్స్, వారిలో సినీ నిర్మాతలు?
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. అత్యంత రహస్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 22 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ శివారు బోయినపల్లిలో రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వెల్లడించారు. పుస్తకాలు, అత్యవసర మందుల రూపంలో షికాగో నుంచి మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకుంటూ విద్యార్థుల పుస్తకాలు, ప్రాణావసరమందులు కావటంతో పెద్దగా అనుమానించేవారు కాదని చెప్పారు.
డ్రగ్స్ రాకెట్ కీలక సూత్రధారి కెల్విన్ మెకనాస్ (29) మ్యుజీషియన్గా పనిచేస్తున్నాడు. పాతబోయినపల్లి రాజారెడ్డి కాలనీలో ప్లాట్నెంబరు 28లో నివాసం ఉంటున్నాడు. ఇతడు చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ఖుద్దూస్(29), మహ్మద్ అబ్దుల్ వాహెద్(20)తో కలసి బోయినపల్లిలో డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు.
21 మంది విఐపిలకు సంబంధాలు....
అత్యంత ఖరీదైన లిసర్జిక్ యాసిడ్ డైథ్లోమైడ్ (ఎల్ఎస్డీ) బ్లాట్స్, మెథలిండియోక్సి మెథియాంఫిటోమైన్ (ఎండీఎంఏ) వారు ముగ్గురు సరఫరా చేస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాతలతో కూడా ఈ గ్యాంగుకు సంబంధాలు ఉన్నాయని, వాటి వివరాలు రాబట్టే పనిలో ఉన్నామని అకున్ సభర్వాల్ తెలిపారు. 21 మంది విఐపిలకు సంబంధాలున్నట్లు తెలిపారు. వారిలో 9మందిని ప్రశ్నించిచనట్లు కూడా తెలిపారు
ఖరీదు దాదాపు రూ.22 లక్షలు...
నిందితుల నుంచి 700 ఎఎల్ఎస్డీ డాట్స్, బ్లాట్స్, 35 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు రూ. 22.41 లక్షల వరకూ ఉండవచ్చని అంచనావేశారు. ఒక్కో ఎల్ఎ్సడీ బ్లాట్ ఖరీదు రూ.1800-3000 వరకూ ఉంటుంది. నిందితుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో డేటా సేకరించినట్లు అకున్ సబర్వాల్ చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి వాటినుంచి తొలగించిన డేటాను కూడా తిరిగి రాబట్టనున్నట్లు తెలిపారు.
టెక్నాలజీ వాడారు...
డ్రగ్స్ సరఫరాకు నిందితులు టెక్నాలజీని ఉపయోగించారు. తమ కస్టమర్లకు సరుకు ఎక్కడ ఇస్తామో ఎస్ఎంఎస్ చేసే స్మగ్లర్లు తాము పంపిన మెసేజ్ పది నిమిషాల్లో అవతలి వారి ఫోన్ నుంచి డిలీట్ అయిపోయేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. వాట్సా ప్, ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ద్వారా మంతనాలు సాగించేవారు.
స్మగ్లర్ల దాడిలో ఇద్దరికి గాయాలు
పాత బోయినపల్లిలో స్మగ్లర్ల నివాసంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ తనిఖీలు చేపట్టిన సమయంలో మత్తులో ఉన్న కెల్విన్ టాస్క్ఫోర్స్ అధికారులపై దాడికి దిగాడు. తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో ఓ పోలీసు అధికారి చేతికి తీవ్రగాయాలయ్యాయి. మరో అధికారి స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల పేర్లను, పాఠశాలల పేర్లను వెల్లడించడానికి అకున్ సబర్వాల్ నిరాకరించారు.