ఆబ్కారీ చేతికి ఫోరెన్సిక్ రిపోర్ట్, మరో 5 చార్జిషీట్ దాఖలుకు రంగం సిద్ధం
హైదరాబాద్ : సమాచార హక్కు చట్టం ద్వారా సుపరిపాలన వేదిక వెలుగులోకి తీసుకొచ్చిన డ్రగ్స్ కేసు .. విచారణ స్పీడ్ పెరిగింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి మరో 5 చార్జిషీట్ దాఖలు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన ఫోరెన్సిక్ నివేదికలు అందాయని, వాటిని చార్జిషీట్లో పొందుపరుస్తామని వివరించారు.
ఇలా వెలుగులోకి ..
అప్పట్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీతారల పేర్లు బయటకొచ్చాయి. వారందరినీ ఎక్సైజ్ అధికారులు విచారించారు. అందరికీ ఫోరెన్సిక్ నిపుణులతో టెస్ట్ చేయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే 7 చార్జిషీట్లు దాఖలు చేశారు. తర్వాత ఈ కేసు సంగతి పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సుపరిపాలన వేదిక తెలుసుకుంది. డిటైల్స్ బహిర్గతమై .. మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో ఎట్టకేలకు ఆబ్కారీ ఉన్నతాధికారులు స్పందించారు. కేసు విచారణ జరగుుతుందని .. ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందని ఫోరెన్సిక్ రిపోర్ట్ ..
12 మంది సినీ ప్రముఖులతో ముడిపడిన వ్యవహారంలో 7 చార్జిషీట్లు దాఖలు చేశారు. వారికి చేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో .. దానిని కలిపి మరో 5 చార్జిషీట్లు వేస్తామని ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. చార్జిషీట్ నమోదు చేసి .. వివరాలు కోర్టుకు అందజేస్తామన్నారు. కోర్టులో విచారణ ద్వారా .. సినీ ప్రముఖలకు శిక్ష ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసు విచారణకే ఏళ్లు పడుతుంటే .. తీర్పు మరెన్ని రోజులవుతుందోనని అనుమానం వ్యక్తమవుతుంది.
కొలిక్కొచ్చేనా ?
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మీ, ముమైత్ ఖాన్ తదితరులు ఆబ్కారీ అధికారులు ఇప్పటికే విచారించారు. తర్వాత వారి రక్త నమూనాలను కూడా సేకరించారు. తాజాగా చార్జిషీట్ దాఖలు చేయడంతో .. ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.