డ్రగ్స్ కేసు: నలుగురు టెక్కీల అరెస్టు, వారిలో గుబులు
సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ దందా కేసులో మరో నలుగురిని అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ దందా కేసు దర్యాప్తును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేగవంతం చేశారు. దీంతో పలువురి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ కేసులో మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాల్లో వారిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మంగళవారం తనిఖీల్లో పట్టుబడిన నలుగురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని, వారు వివిధ బహుళ జాతి కంపెనీ (ఎంఎన్సి)ల్లో పనిచేస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటి వరకు 100 ఎల్సిడిలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నలుగురిని అరెస్టు చేయడంతో ఇప్పటి వరరకు కేసులో అరెస్టయినవారి సంఖ్య ఏడుకి చేరుకుంది.
డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న సినీ నిర్మాతను, దర్శకుడిని అధికారులు మంగళవారం ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు అధికారులు ఇప్పటికే మాదాపూర్లోని ఆరు ఎంఎన్సి కంపెనీలు, నగరంలోని 8 స్టార్ హోటళ్లకు చెందిన ప్రతనిధులను విచారిస్తున్నట్లు సమాచారం.
ఎల్ఎస్డీ, ఎండిఎంఎ డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో పాటు అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆ ముగ్గురికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించి, చర్లపల్లి జైలుకు తరలించాలని ఆదేశించింది.వారిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించడానికి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.