మరోసారి డ్రగ్స్ కలకలం: ముగ్గురు విద్యార్థుల అరెస్ట్
నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నగర శివారులోని శాంతినగర్లో డ్రగ్స్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నగర శివారులోని శాంతినగర్లో డ్రగ్స్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న సుమారు 500గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ తీసుకోవడంతోపాటు సరఫరా చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి అరవింద్, ఐటీఐ విద్యార్థులు శ్రవణ్, హేమంత్ అనే ముగ్గుర్ని పోలీసులు విచారిస్తున్నారు. వీరి వద్దకు డ్రగ్స్ ఎలా వచ్చింది?, ఎప్పట్నుంచి ఈ వ్యవహారం నడుపుతున్నారనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాలేజీ విద్యార్థులతోపాటు స్కూల్ విద్యార్థులకు కూడా డ్రగ్స్ సరఫరాదారులు డ్రగ్స్ను సరఫరా చేసినట్లు తేలింది. ఇప్పుడు మరోసారి ఈ విద్యార్థులు పట్టబడటంతో మరోసారి సంచలనంగా మారింది.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన విచారిస్తున్న సమయంలోనే మరోసారి డ్రగ్స్ విద్యార్థుల వద్ద లభించడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.