డ్రగ్స్ కేసు: ‘ఉడ్తా టాలీవుడ్’ నిజమే! గుడ్విల్ కోసమే, పూరీ కొంప ముంచిన శ్యామ్ కే నాయుడు?!
డ్రగ్స్ కేసులో.. సిట్ అధికారుల విచారణలో కెమెరామన్ శ్యామ్ కే నాయుడు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్వాడతారని, పరిశ్రమలో ఇతరులకు గుడ్విల్ కోసం సరఫరా చేసేవా
హైదరాబాద్: 'ఉడ్తా టాలీవుడ్' సినిమా రెండో రీలులోనే కథ రసకందాయంలో పడింది. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి, తొలి రోజు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ను విచారించిన సిట్ అధికారులు.. రెండోరోజు కెమెరామన్ శ్యామ్ కే నాయుడిని ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు శ్యాం కె నాయుడు (ఫొటోలు)
సుమారు ఐదు గంటలపాటు కొనసాగిన విచారణలో శ్యామ్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో డ్రగ్స్ వాడకం సాధారణమేనని చెప్పిన ఆయన.. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్వాడేవారని, పరిశ్రమలో ఇతరులకు గుడ్విల్ కోసం సరఫరా చేసేవారని కూడా చెప్పారని సమాచారం.
నాకు సిగరెట్ అలవాటు కూడా లేదు...
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న కెమెరామన్ శ్యామ్ కే నాయుడు.. గురువారం నాంపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన విచారణలో శ్యామ్ కు సిట్ అధికారులు 30 ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ కాదుకదా.. కనీసం సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని శ్యామ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. షూటింగ్లో సిగరెట్ కాల్చే సీనుంటే ముక్కుకు గుడ్డ కప్పుకొని కెమెరాను ఆపరేట్ చేస్తుంటానని కూడా వెల్లడించినట్టు తెలిసింది. అవసరమైతే తదుపరి విచారణకు హాజరు కావలసి ఉంటుందని కూడా సిట్ బృందం ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
పూరీ కేంద్రంగా: సుబ్బరాజుకు సిట్ ఆఫర్, ఇక్కడా అదే కీలకం, అకున్ పక్కా ప్లాన్తో..
‘పూరీ ప్రతి కదలికా నాకు తెలుసు...’
దర్శకుడు పూరీ జగన్నాథ్ తీసిన 17 సినిమాలకు శ్యామ్ కే నాయుడు కెమెరామన్గా పనిచేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ కు సంబంధించి పలు వివరాలు శ్యామ్ వెల్లడించినట్లు తెలిసింది. పూరీతో తాను చాలా సన్నిహితంగా ఉండేవాడినని, ఆయన ప్రతి కదలిక తనకు తెలుసునని సిట్ విచారణలో శ్యామ్ వెల్లడించినట్లు సమాచారం. పూరీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన ఏర్పాటు చేసే ఫంక్షన్లకు, పార్టీలకు అప్పుడప్పుడు వెళ్లేవాడినని, అదికూడా అక్కడకు వచ్చే ప్రముఖులతో పరిచయాలు పెంచుకునేందుకేనని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ మాఫియా డాన్ కెల్విన్ ఎవరో తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు తొలుత చెప్పినప్పటికీ.. సిట్ అధికారులు కొన్ని ఫొటోలు, వీడియోలు చూపెట్డడంతో.. కెల్విన్ తనకు తెలుసుకానీ, నేరుగా పరిచయం లేదని అంగీకరించినట్లు తెలిసింది.
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి...
సిట్ అధికారుల ప్రశ్నలతో శ్యామ్ కే నాయుడు ఉక్కిరబిక్కిర అయినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ తో సంబంధాలు, సినిమా పరిశ్రమలో డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు? సినిమా ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారా? సినీ ప్రముఖులకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయన ఎవరెవరికి సరఫరా చేశారు? అంటూ అధికారులు శ్యామ్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అంతకుమునుపు ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కెల్విన్, పూరీలను విచారించిన సందర్భంగా వెల్లడైన పలు విషయాలను సిట్ అధికారులు తెలివిగా శ్యామ్ కే నాయుడిని అడిగి నిర్ధారణ చేసుకున్నట్లు తెలుస్తోంది. పూరీని ఎన్నిసార్లు.. ఎక్కడెక్కడ కలిశారు? అతనితో ఎలాంటి ఈవెంట్లు నిర్వహించారనే అంశాలపైనా సమాచారం రాబట్టారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ను రాత్రి వేళ్లల్లో నిర్వహించే ఈవెంట్లలో వాడారా? లేకపోతే పగటిపూట నిర్వహించిన పార్టీల్లో ఉపయోగించారా? అని కూడా వారు వాకబు చేసినట్టు సమాచారం.
ఆయన డ్రగ్స్ వాడతారు.. వాడిస్తారు..
శ్యామ్ కే నాయుడిని విచారిస్తున్న సమయంలో సిట్ అధికారులు.. పూరీ జగన్నాథ్ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఒక ఫొటోను అతడికి చూపెట్టారు. ఆ ఫొటోలో పూరీతోపాటు శ్యామ్ కూడా ఉన్నారు. ఆ ఫొటోని చూసిన శ్యామ్ కే నాయుడు.. పూరీ మత్తుమందు నింపిన సిగరెట్లను తాగేవారని చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, పూరీ జగన్నాథ్ స్వయంగా డ్రగ్స్ వాడటమేకాకుండా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్తోపాటు కొందరు ప్రముఖులకు కూడా ఆయన డ్రగ్స్ సరఫరా చేసేవారని శ్యామ్ కే నాయుడు సిట్ అధికారులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం.
గుడ్విల్ కోసమే డ్రగ్స్ అందించేవారు...
సిట్ అధికారుల విచారణలో డ్రగ్స్ వాడకంపై పలు ఆసక్తికర సంగతులను శ్యామ్ కే నాయుడు వెల్లడించినట్లు తెలుస్తోంది. కొంతమంది సిగరెట్లలో, మరికొందరు పౌడర్ పీల్చడం ద్వారా డ్రగ్స్ తీసుకునే వారని.. మత్తు కలిగించే సిగరెట్లు కాల్చడం, నిషాలో మునగడం.. ఇలాంటివన్నీ సినీ ప్రముఖులకు సాధారణమేనని చెప్పినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ఈవెంట్లకు వచ్చే వారికి, ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు గుడ్విల్ కోసం డ్రగ్స్ అందించేవారని.. ఈవెంట్, సీక్రెట్ పార్టీలు ఏర్పాటు చేసుకుని, ఎంపిక చేసిన వారిని ఆయన ఆహ్వానించే వారని, వారంతా ఆనందోత్సాహాలతో గడిపేలా డ్రగ్స్ అందించేవారని కూడా శ్యామ్ కే నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. పబ్ కల్చర్ కు పూరీ ప్రాధాన్యం ఇస్తుండేవారని, పార్టీల్లో డ్యాన్స్ లు చేయడం, అందుకు ఊపునిచ్చే డ్రగ్స్ తీసుకోవడం నిజమేనని, కొంతమంది హీరోయిన్లకు కూడా ఈ మాదక ద్రవ్యాలు అలవాటు చేసేందుకు ప్రయత్నించే వారని కూడా శ్యామ్ పేర్కొన్నట్లు సమాచారం.
శ్యామ్ కే నాయుడిని.. సాక్షిగా...
డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణలో శ్యామ్ కే నాయుడు కీలకమైన వివరాలు వెల్లడించడంతో ఆయన్ని ఈ కేసులో సాక్షిగా మార్చాలని సిట్ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. శ్యామ్ కే నాయుడిని సిట్ అధికారులు శీలం శ్రీనివాస్రావు, జి.శ్రీనివాస్రావుతోపాటు ఏఈఎస్ విజయ్కుమార్, ఎస్ఐ వేణుకుమార్ విచారించారు. శ్యామ్ కే నాయుడు తమ విచారణకు చక్కగా సహకరించారని, ఆయన చెప్పిన వివరాలను బట్టి ఆయన్ని ఈ కేసులో సాక్షిగా చేర్చేందుకు కూడా సరిపోతాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. విచారణలో పూరీ జగన్నాథ్ నుంచి సేకరించినట్లే శ్యామ్ నుంచి కూడా ఆయన గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. వీటిని వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు.