భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: నైజీరియన్తోపాటు ముగ్గురి అరెస్ట్, ‘రేవ్పార్టీలు’
ఓ వైపు సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణ జరుపున్న నేపథ్యంలో నగరంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది.
హైదరాబాద్: ఓ వైపు సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్ అధికారులు విచారణ జరుపున్న నేపథ్యంలో నగరంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. గాబ్రియెల్ అనే నైజీరియన్ తోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాబ్లెట్లు, చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో వీరు డ్రగ్స్ సరఫరా చేస్తుండటం గమనార్హం. నిందితులను నగరంలోని యాప్రాల్లో అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
కెల్విన్తో సంబంధాలు
సోమవారం ఆయన మీడియాతో డ్రగ్స్ రాకెట్ వివరాలను వెల్లడించారు. గాబ్రియెల్కు డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు కెల్విన్తో సంబంధాలున్నాయని తెలిపారు. అరెస్టైన నలుగురు నిందితులు కూడా పలువురు ప్రముఖులకు, పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. 2014లో స్టూడెంట్ వీసాపై భారత్కు గాబ్రియెల్ వచ్చాడని, నిజాం కాలేజీలో చేరాడని భగవత్ తెలిపారు. ఆ తర్వాత నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు.
పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా..
ఈ ముఠాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ యువకుడు ఉన్నాడని, అతడు నగరంలోని ఈసీఐఎల్ ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిపారు.
అరెస్టైన నలుగురు నిందితుల్లో ఒకడైన అంకిత్ పాండే ఓ పబ్లో డీజేగా పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు. అంకిత్ పాండే తమకు కీలక విషయాలు చెప్పాడని తెలిపారు. మరో యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి పూర్తిగా డ్రగ్స్ సరఫరా చేసే పనిలో ఉన్నాడని చెప్పారు. అతడ్ని అరెస్ట్ చేసే సమయంలో అతడి తండ్రి.. తన కొడుక్కి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, సరైన సమయంలో మీరు వచ్చారని పోలీసులకు చెప్పాడని తెలిపారు.
భారీ రేవ్ పార్టీ..
కాగా, డ్రగ్స్ మాఫియా ముఠా సభ్యులంతా కలిసి ఆగస్టు 15న గోవాలో భారీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లు నిందితులు తెలిపారని చెప్పారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన జాన్ హెన్రీతో కూడా ఈ నలుగురు నిందితులకు సంబంధాలున్నాయని సీపీ చెప్పారు. గాబ్రియెల్ గతంలో కొకైన్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని చెప్పారు. అయినా డ్రగ్స్ సరఫరా చేయడం మానుకోలేదని చెప్పారు. తన ప్రియురాలు ఇస్తర్తో కలిసి నగరంలోనే నివాసం ఉన్నాడని, ఆ తర్వాత బెంగళూరుకు మకాం మార్చి, అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడని తెలిపారు.
కీలక విషయాలు..
గాబ్రియల్ పలు ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేశఆడని, ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఇతనికి కస్టమర్లున్నారని సీపీ తెలిపారు. నిందితుడు పవన్ కుమార్ రెడ్డి వద్ద అంపిటమిన్ టాబ్లెట్, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులకు పలువురు ప్రముఖులతో సంబంధాలున్నాయని చెప్పారు. అంతేగాక, నిందితులు విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. వారిచ్చిన సమాచారంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, నిందితులను పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా సీపీ మహేష్ భగవత్ అభినందించారు. వారికి క్యాష్ అవార్డు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.